నాడు కింగ్మేకర్లు: ఆ ముగ్గురి భవితవ్యం ఏమిటీ?
తూర్పుగోదావరి జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపిలు రాజకీయ భవితవ్యం ఏమిటనే చర్చ సర్వత్రా సాగుతోంది.కాకినాడ, రాజమండ్రి అమలాపురం ఎంపీలు పళ్ళంరాజు, ఉండవల్లి అరుణ్కుమార్.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపిలు రాజకీయ భవితవ్యం ఏమిటనే చర్చ సర్వత్రా సాగుతోంది.కాకినాడ, రాజమండ్రి అమలాపురం ఎంపీలు పళ్ళంరాజు, ఉండవల్లి అరుణ్కుమార్, జీవీ హర్షకుమార్లు 2019 ఎన్నికల్లో ఎటు మొగ్గుచూపుతారనేది ప్రస్తుతం హట్టాపిక్గా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఈ ముగ్గురు ఎంపీలు వ్యవహరించారు.2004, 2009 ఎన్నికల్లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం నియోజకవర్గాల నుండి వరుసగా పళ్ళంరాజు, ఉండవల్లి అరుణ్కుమార్, హర్షకుమార్లు విజయం సాధించారు.
అయితే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కలేదు. కనీసం డిపాజిట్లు కూడ దక్కని పరిస్థితి కూడ నెలకొంది.2014 ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.
ఈ ముగ్గురు మాజీ ఎంపీలు తమ రాజకీయ భవితవ్యం కోసం అడుగులు వేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది.అయితే వీరు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి నెలకొంది.
పళ్ళంరాజు పయనమెటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్రమంత్రిగా పళ్ళంరాజు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాకు అత్యంత సన్నిహితునిగా వెలుగొందారు. కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఆయన పార్టీ మారే పరిస్థితి కూడా కన్పించడంలేదంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలు కాంగ్రెస్కు సానుకూలంగా లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఉండవల్లి ఏ పార్టీలో చేరుతారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డిలకు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ హయంలో ఆయనకు సలహదారుడిగా ఉండవల్లి వ్యవహరించేవారనే ప్రచారం కూడ లేకపోలేదు. వైఎస్ మరణించిన తర్వాత కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ ఉండవల్లి ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
అంతేకాదు కిరణ్కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీలో అమలాపురం ఎంపీ జీవి హర్షకుమార్, ఉండవల్లి చేరారు. గత ఎన్నికల్లో రాజమండ్రి నుండి పోటీకి ఉండవల్లి అరుణ్కుమార్ దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే వైసీపీలో చేరుతారా, మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హర్షకుమార్ వైసీపీలోకి వెళ్తారా?
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. అమలాపురం ఎంపీ టిక్కెట్టు లేదా ఇతర పదవి విషయమై భరోసా ఇస్తే వైసీపీలోకి చేరేందుకు హర్షకుమార్ సానుకూలంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకొంది.
మాజీ ఎంపీలు 2019 ఎన్నికల్లో
ఈ ముగ్గురు మాజీ ఎంపీలు 2019 ఎన్నికల్లో తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ముగ్గురు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే మారిన ఏపీ రాజకీయ ముఖచిత్రం నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ ముగ్గురు ఒకే పార్టీలో ఉంటారా, వేర్వేరు పార్టీల నుండి బరిలోకి దిగుతారా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ విషయాలపై రానున్న నాలుగైదు మాసాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.