మస్కా లగారహా హై: ఎన్టీఆర్పై వాజపేయి సెటైర్ వేసిన వేళ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: అటల్ బిహారీ వాజపేయి ఉత్తమ ప్రధానే కాదు, మంచి వక్త కూడా. అంతేగాక, ఆయన కవితలు ఎంతో ఆసక్తిగా, ఆలోచనలో పడేసేలా ఉంటాయి. పార్లమెంటు లేదా బహిరంగసభల్లో లేదా పార్టీ సమావేశాల్లో నిత్యనూతనమైన ఛలోక్తులు విసిరేవారాయన. ప్రతిపక్షనేతలు సైతం ఆయన వాగ్దాటికి ముగ్ధులయ్యేవారు.
అటల్జీ మాటల్లోని కొన్ని మచ్చుతునకలు..
'' జాతీయ భద్రతతో దేశం ఎన్నడూ రాజకీయాలు చేయలేదు.''
'' మన సమస్యలను తుపాకులు పరిష్కరించలేవు. కేవలం సోదరత్వమే కాపాడుతుంది.''
'' మన విలువైన వనరులను యుద్ధాల పేరుతో వృథా చేస్తున్నాం. నిరుద్యోగం, దారిద్ర్యం, వెనుకబాటుతనాలపై నిజంగా యుద్ధాలు చేయాల్సి ఉంది.''
'' రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలకే నా ప్రాధాన్యం. అదే భారత దేశ ప్రజాస్వామ్యానికి వినూత్నమైన బలం.''
'' గెలుపు ఓటములు జీవితంలో ఒక భాగమే వాటిని సమానదృష్టితో చూడాలి.''
'' మన స్నేహితులను మార్చుకోగలం కానీ పొరుగవారిని మార్చలేం కదా.''
Recommended Video
'' నాకు ఒక కల ఉంది. ఆకలి, నిరక్షరాస్యత నుంచి భారత్ విముక్తి పొందగలదని.''
'' భారత్లో ఎవరూ ఒంటరి అని అనుకోకూడదు. భారతీయులందరూ అతడికి చేయూతగా ఉన్నారని తెలియజేయాలి.'' అనేవి ఆయన మాటల్లోని కొన్ని మచ్చు తునకలు.
కాగా, ఎప్పుడూ ఛలోక్తులు విసిరే వాజపేయి.. ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వాజపేయి ఆయనపై వేసిన జోక్ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్నరోజుల్లో కాంగ్రేసేతర పక్షాలను ఒకతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నించేవారు. తరచుగా విపక్షాల సదస్సులు ఏర్పాటు చేసేవారు. అలాంటి ఒక సదస్సుకు పలువురు జాతీయ నేతలతోపాటుగా వాజపేయి హాజరయ్యారు. భోజనాల వేళ ఎన్టీఆర్ తనదైన శైలిలో వారందిరికీ బకెట్లో వెన్నతెచ్చి స్వయంగా వడ్డిస్తున్నారు. అప్పుడు వాజపేయి సరదాగా రామారావు సాబ్నే హమ్కో మస్కా లగారహా హై (రామారావుగారు మనకు మస్కా కొడుతున్నారు) అని చెణుకు విసిరితే అంతా నవ్వుల్లో మునిగిపోయారు.