కోడెల శివరాంకు బెయిల్: ప్రతి శుక్రవారం సంతకం
గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మంగళగిరిలోని జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఫర్నిచర్ ను అక్రమంగా తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నారనే కేసులో శివరాంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 9వ తేదీ నాటికి న్యాయస్థానంలో లొంగిపోవాలంటూ హైకోర్టు ఆయనను ఆదేశించిన విషయం తెలిసిందే.
కోర్టులో లొంగిపోయిన కోడెల తనయుడు శివరాం: ఆరు కేసుల్లో బెయిల్: ఇక..తండ్రి ఆత్మహత్య కేసులో..!
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన మంగళగిరి న్యాయస్థానంలోొ లొంగిపోయారు. శివరాం తరఫు న్యాయవాది అబ్దుల్ రజాక్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అనంతరం దీనిపై సానుకూల తీర్పును వెలువరించింది. శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. శివరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో..దీనికి సంబంధించిన ష్యూరిటీ పత్రాలను అబ్దుల్ రజాక్ మంగళగిరి న్యాయస్థానానికి అందజేశారు. ప్రతి శుక్రవారం శివరాం తుళ్లూరు పోలీస్ స్టేషన్కు హాజరై, తప్పనిసరిగా సంతకం పెట్టాల్సి ఉంటుందని బెయిల్ పత్రాల్లో పొందుపరిచారు.
కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పని చేసిన కాలంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం మళ్లించుకున్నారనే ఆరోపణలు శివరాంపై ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లో కొనసాగిన ఏపీ అసెంబ్లీని రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీకి తరలించే సమయంలో సుమారు 70కి పైగా అసెంబ్లీ ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని కోడెల శివరాం పార్టీ కార్యాలయం, హీరో హోండా షోరూంలకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.
కేసు నమోదైన తరువాత కొన్ని రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో గడిపారు. అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని హైకోర్టు తోసి పుచ్చింది. ఈ నెల 9వ తేదీ నాటికి స్థానిక న్యాయస్థానంలో లొంగిపోవాలని, ఆ తరువాత బెయిల్ తీసుకోవచ్చని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మంగళగిరి న్యాయస్థానానికి హాజరయ్యారు. బెయిల్ ను పొందరు. కాగా కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసు విషయంలో పోలీసులు శివరాంతో పాటు ఆయన సోదరి విజయలక్ష్మీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ప్రయత్నించగా.. వారు సహకరించలేదని తేలింది. హైదరాబాద్ లో వాంగ్మూలం ఇవ్వకపోవడంతో గుంటూరుకు వెళ్లాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు.