మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం...ఆమె భర్త కృష్ణప్రసాద్ కు అస్వస్థత
శ్రీకాకుళం:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదని...ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ప్రతిభా భారతి శరీరం వైద్యానికి సహకరించడం లేదని...మంగళవారం నాటికి ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని తెలుస్తోంది. విశాఖ పినాకిల్ ఆసుపత్రిలో నాలుగురోజులుగా చికిత్స పొందుతున్నా ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె శరీరంలోకి రక్తం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నా ఎక్కకపోవడమే వారిని మరింత ఆందోళన చెందుతున్నారు.
ప్రతిభా భారతి శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య అంతకంతకూ పడిపోతుండటంతో డాక్టర్లు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇన్ పెక్షన్స్ పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. పైగా హిమోగ్లోబిన్ శాథం కూడా బాగా తక్కువగా ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రతిభా భారతిని హైదరాబాద్ గాని, బెంగళూరు గాని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అస్వస్థతకు గురైన ప్రతిభా భారతి తండ్రి కొత్తపల్లి పున్నయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారని తెలిసింది. అయితే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసే మరో అంశం ఆస్పతిలో చోటుచేసుకుంది.
ఆస్పత్రి వద్దే ఉండి భార్య చికిత్సను పర్యవేక్షిస్తున్న ప్రతిభా భారతి భర్త కావలి కృష్ణప్రసాద్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. తన భార్య, మామగారు చికిత్స పొందుతున్న పినాకిల్ ఆస్పత్రిలోనే ఆదివారం వరకు కృష్ణప్రసాద్ ఉన్నారు. అనంతరం సాయంత్రం కావలి గ్రామానికి చేరుకున్న కృష్ణప్రసాద్కు షుగర్, బీపీ పెరగడంతో అస్వస్థతకు లోనయ్యారని తెలిసింది. దీంతో ఆయన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.