నా భర్త అదృశ్యం.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన.. వైసీపీ కారణమంటూ..
భూమా అఖిల ప్రియ తమపై, తన భర్తపై వైసీపీ నేతలు కక్ష సాధిస్తున్నారని లబోదిబోమంటున్నారు. ఇక తన భర్త కనిపించటం లేదని, ఎక్కడ ఉన్నాడో తనకు కూడా తెలీదని ఆమె వాపోయారు. కావాలనే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పులివెందుల వెళ్లినందుకే ఇలా కేసులు పెడుతున్నారని అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు
ఎన్నికల్లో ఓటమితో ఇబ్బందుల్లో అఖిల ప్రియ
చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి భూమా దంపతుల మరణానంతరం రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు భూమా అఖిల ప్రియ . గః ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన నాటి నుండి ఆమె తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన భూమా అఖిలప్రియ గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని సైతం గెలిపించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అఖిలతో పాటు ఆమె సోదరుడు కూడా ఓటమిపాలు కావటం ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది.
క్రషర్ విషయంలో వివాదం .. అఖిలభర్తపై కేసు
ఏపీ మాజీమంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్తపై ఇటీవల కేసు నమోదైంది. క్రషర్ ఇండస్ట్రీ తనకు ఇవ్వాలని ఇండస్ట్రీ ఓనర్ ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో సదరు ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టనర్ షిప్ లో నడుస్తున్న క్రషర్ విషయంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యం చేసుకొని క్రషర్ ఇండస్ట్రీ మొత్తం తమకే చెందుతుందని, తమకు అప్పగించాలని గత కొంతకాలంగా శివరామిరెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.
పరారీలో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్
అంతే కాకుండా శివరామిరెడ్డి కి సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని , క్రషర్ తమకు అప్పగించాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చెయ్యటంతో అఖిల ప్రియ భర్త అజ్ఞాతంలో ఉన్నారు.అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ హైదరాబాద్ లో తన కారుకు అడ్డు వచ్చిన పోలీసులను సైతం భార్గవ్ రామ్ ఢీకొట్టి వెళ్లిపోయాడన్న టాక్ కూడా వచ్చింది. ఏదేమైనా భార్గవ్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు.ఈ క్రమంలోనే అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పారు.
తన భర్త ఎక్కడ ఉన్నారో తెలీదంటున్న అఖిల ప్రియ
తనతో టచ్ లో లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై నమోదైనవి అన్ని తప్పుడు కేసులే అని ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు.ఇక క్రషర్ వివాదం కూడా సివిల్ వివాదమే అని దానికోసం పోలీసులు జోక్యం చేసుకోవటం అవసరం లేదని , కూర్చొని మాట్లాడుకుంటేనే సరిపోయేదని చెప్పారు. క్రషర్ విషయంలో తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దీని వెనుక వైసీపీ నేతల హస్తం వుందని ఆమె పేర్కొన్నారు.
ఇది వైసీపీ కుట్ర అని విమర్శలు
తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చేవాళ్లమని చెప్పిన అఖిల ఇక తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిన వైసీపీ నేతలే ఇదంతా చేయిస్తున్నారని చెప్తున్నారు . ఈ క్రమంలోనే ఆమె ముఖ్యమంత్రి జగన్ పై సైతం విమర్శలు చేశారు . జగన్ చెప్పకుండా తెలంగాణలో కేసులు పెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.