నవరత్నాల పేరుతో నవరత్న ఆయిల్ రాస్తున్న జగన్- పన్నుల పెంపుపై కొల్లు రవీంద్ర
ఏపీలో ఆస్తిపన్నుతో పాటు ఇతర పన్నుల్ని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సర్కార్ నిర్ణయంపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పన్నుల పేరుతో ప్రజల్ని దోచుకుతింటున్నారని కొల్లు విమర్శించారు. గతంలో ధరలపై జగన్ మొసలి కన్నీరు కార్చారని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. పన్నుల్లో రాష్ట వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించవచ్చు కదా అని జగన్ సర్కార్కు సూచించారు. గతంలో అసెంబ్లీలో పెట్రోల్ ధరల పెరుగుదలపై జగన్ చేసిన విమర్శల్ని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో తాజాగా పెరుగుతున్న పన్నులపైనా కొల్లు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం మెప్పు కోసం సీఎం జగన్ ప్రజలపై పన్నులు వేస్తున్నారని, పెరిగిన పన్నులను రద్దు చేయని పక్షంలో ప్రజల్ని కలుపుకుని ఉద్యమం చేపడతామన్నారు.
పన్నులు 15 శాతమే పెంచుతున్నామన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర తీవ్ర అభ్యంతరం తెలిపారు. 15 శాతమంటే మీకు తక్కువగా కనిపిస్తోందా అని అడిగారు. పథకాల పేరుతో ప్రజలకు ఎర వేసి పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో నవరత్న ఆయిల్ రాస్తున్నారని సీఎం జగన్ను విమర్శించారు. మంత్రి పేర్నినానిని కూడా కొల్లు టార్గెట్ చేశారు. బందరు మున్సిపల్ కార్యాలయంలో మీ పుత్రరత్నం సమీక్షలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నిక కోసం బందరు నుంచి వైసీపీ కార్యకర్తల్ని తరలించడం వల్లే ఇక్కడ కేసులు పెరిగాయన్నారు.