తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో: రేవంత్ రెడ్డిని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని
అమరావతి: రేవంత్ రెడ్డి.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. తొలుత తెలుగుదేశం పార్టీలో.. అరంతరం కాంగ్రెస్ కండువాను కప్పేసుకున్న రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. ఎంత కీలకంగా అంటే.. చివరికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖాయం కావచ్చనే స్థాయిలో.
ఈ విషయంలో ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. మొదటి నుంచీ కాంగ్రెస్లో కొనసాగుతోన్న సీనియర్లు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోందడటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు.. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని సరైన దిశలో నడిపించలేరని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఆయన దోస్తీ ఇంకా కొనసాగుతోందని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాాంధీ దృష్టికీ తీసుకెళ్లారు.
అదేలా ఉన్నప్పటికీ.. ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తాజాగా రేవంత్ రెడ్డిని కలిశారు. మల్కాజ్గిరిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వివాహ శుభలేఖను రేవంత్ రెడ్డికి అందజేశారు. ప్రస్తుతం చింతమనేని హైదరాబాద్లో ఉన్నారు. ఇదివరకే ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ను కలిశారు. వివాహ శుభలేఖను అందజేశారు.
తాజాగా- రేవంత్ రెడ్డిని కలిసుకున్నారు. ఈ ఉదయం ఆయన తన అనుచరులు, పార్టీ నేతలతో కలిసి మల్కాజ్గిరిలోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను కలుసుకున్నారు. అనంతరం ఆయనకు వివాహ శుభలేఖను అందజేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముందున్న రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా చింతమనేని అభినందించినట్లు చెబుతున్నారు. చింతమనేని పెద్ద కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహం వచ్చేనెల 2వ తేదీన జరుగనుంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఈ పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించారు.