జగన్ సర్కార్ కక్ష సాధింపు.. అక్రమ కేసులు: ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ పిటీషన్: రేపు విచారణ
అమరావతి: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ఉద్దేశపూరకంగా కేసులను బనాయించిందని ఆరోపించారు. రాజకీయంగా తమను అణచి వేయడానికి కేసులను నమోదు చేసిందని పేర్కొన్నారు.
అక్రమ కేసుల నుంచి తమకు బెయిల్ను మంజూరు చేయాలని వారు ఈ పిటీషన్లో అభ్యర్థించారు. ఈ పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇది వరకు వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను అనంతపురం జిల్లా న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఈ గడువు ఇంకా ముగియలేదు. రిమాండ్లోనే కొనసాగుతున్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు.
నాగాలాండ్లో లారీలుగా రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను ప్రైవేటు బస్సులుగా మార్చారని, దీనికోసం ఫోర్జరీకి సైతం పాల్పడ్డారంటూ కొద్దిరోజుల కిందటే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై కేసు నమోదైంది. పోలీసులు వారిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి వారిని 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా వారిని అనంతపురం జిల్లా జైలుకు తరలించడానికి ఏర్పాట్లు చేయగా.. ఖైదీకి కరోనా వైరస్ సోకింది.
Recommended Video
దీనితో వారిని కడప జిల్లాలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడే విచారణను ఎదుర్కొంటున్నారు. తమకు బెయిల్ కావాలంటూ అనంతపురం జిల్లా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్నారని, విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయగా.. బెయిల్ పిటీషన్ను కొట్టేసింది అనంతపురం న్యాయస్థానం. దీనితో వారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అంటూ బెయిల్ పిటీషన్లో పేర్కొన్నారు.