పాపం పండితే కరోనాలే వస్తాయంటున్న జేసీ.. జనాభా తగ్గుతుందని జోస్యం.. జగన్ పైనా విసుర్లు..
ఏపీలో నిత్యం తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో ఉంటున్న జేసీ తాజాగా కరోనా వైరస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం రాజకీయాల గురించి మాట్లాడే జేసీ ఒక్కసారిగా కరోనాపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కరోనావైరస్ రాక, వ్యాప్తి, ప్రభావం గురించి ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఆసక్తి చేపుతున్నాయి.
కరోనా పై జేసీ హాట్ కామెంట్స్..
దేశంలో కరోనా వైరస్ రాక, వ్యాప్తికి గల కారణాలను టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో భాష్యం చెప్పారు. దేశంలో పాపం పండినప్పుడు ఇలాంటి వైరస్ లే వస్తాయని జేసీ తెలిపారు. అంటే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులే కరోనా రాకకు కారణమని జేసీ పరోక్షంగా చెప్పుకొచ్చారు..
జనాభా తగ్గుతుందని జోస్యం..
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కారణంగా జనాభా కూడా భారీగా తగ్గుతుందని జేసీ జోస్యం చెప్పారు.
పాపం బాగా పెరిగినప్పుడు దేవుడు గానీ, ప్రకృతి గాని ఇలాంటిది ఒకటి సృష్టించి కొంత జనాభాను తగ్గిస్తున్నాయని జేసీ విశ్లేషించారు.
ప్రతీ వందేళ్లకు ఒకసారి ఇలాంటి విపత్తులు చోటుచేసుకుంటున్నాయని జేసీ పేర్కొన్నారు.
జగన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు...
కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపైనా జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. కరోనా వైరస్ను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని జేసీ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని జగన్ చెప్పారని, ఇది జగన్ తెలిసి అన్నాడో.. తెలియక అన్నాడో తనకు తెలియదని జేసీ వ్యాఖ్యానించారు.
వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి.. కోట్ల సంపాదన..
ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యవసాయ క్షేత్రాలే మేలని జేసీ చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటే కరోనా రాదని జేసీ పేర్కొన్నారు. అందుకోసమే తాడిపత్రి పట్టణాన్ని వదిలిపెట్టి.. జూటూరులో ఉన్న తోటలో ఉంటున్నానని జేసీ చెప్పారు. అక్కడ పండిన పంటలతో కోటి రూపాయల వరకూ సంపాదించానన్నారు. తన శేష జీవితం మొత్తం జూటూరులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గడపాలని ఆశగా ఉందని జేసీ తెలిపారు.