సీనియర్ గానే జగన్ కు సలహా - దానికే బెదిరింపు కాల్స్, బూతులా- రాయపాటి ఆవేదన..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దీనిపై ఆయన ఇవాళ క్లారిటీ ఇచ్చారు. కమ్మవారిపై ద్వేషం మంచిది కాదంటూ ఓ సీనియర్ గా సలహా ఇచ్చానని, కానీ మీడియా దాన్ని అపార్ధం చేసుకుందన్నారు. సోషల్ మీడియాలోనూ తనపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా వ్యాఖ్యలు అపార్ధం చేసుకున్నారు ..
ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో వ్యవహరించిన తీరుపై మండిపడుతూ కమ్మవారిని తక్కువ అంచనా వేయొద్దంటూ టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కమ్మ వారు కనిపిస్తే పక్కనబెట్టేస్తున్నారని, ప్రభుత్వాన్ని రెడ్లతో నింపేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ సామాజిక వర్గాల వారీగా యుద్ధం జరుగుతుండటంతో రాయపాటి దీనిపై స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందంటూ ఓ క్లారిటీ ఇచ్చారు.
సీనియర్ గానే సలహా- వైఎస్ నాకు ఆప్తుడే..
రాష్ట్రంలో సీఎంగా ఉన్న వారు అన్ని కులాలను కలుపుకుని వెళ్లాలని మాత్రమే తాను చెప్పానని, కమ్మ వారిపై ద్వేషం మంచిది కాదని రాజకీయాల్లో సీనియర్ గా జగన్ కు సలహా ఇచ్చినట్లు రాయపాటి చెప్పారు. జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. జగన్ తండ్రి వైఎస్ తనకు మంచి సన్నిహితుడుని రాయపాటి గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం లో కమ్మ కులస్తుల పట్ల జరుగుతున్న వివక్షపైనే తాను మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను అనలేదన్నారు.
బెదిరింపులా.. బెదిరింపు కాల్స్, సోషల్ మీడియాలో బూతులు..
సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం తనను బాధించిందని, జగన్ రెడ్డి పది కాలాలపాటు సీఎం గా కొనసాగాలంటే అందరినీ కలుపుకుపోవాలని సలహా ఇచ్చినట్లు రాయపాటి క్లారిటీ ఇచ్చారు.ఫ్యాక్షన్ రాజకీయాలకు తొలి నుంచీ తమ కుటుంబం వ్యతిరేకమని, తాను అనని మాటలు అన్నట్లు ప్రచారం కావడంతో రాత్రి నుండి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ తనపై అసభ్యంగా వ్యాఖ్యలు పెడుతున్నారని రాయపాటి ఆరోపించారు.