తిరుపతికి మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయం తరలింపు..సోమవారం అంత్యక్రియలు
తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ శనివారం అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ మృతికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. ఆయన ప్రజలకోసం చేసిన సేవలను కొనియాడారు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ముందు ఆయన విభిన్న వేషాలతో నిరసన తెలిపారని గుర్తుచేసుకున్నారు.
మొత్తంగా ప్రజానాయకుడిగా శివప్రసాద్ గుర్తింపు పొందారని కొనియాడారు. చెన్నై అపోలో హాస్పిటల్లో మృతి చెందిన శివప్రసాద్ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం తిరుపతికి తరలిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచుతారు. సోమవారం రోజున శివప్రసాద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 2:10 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్... గురువారం అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శివప్రసాద్ను కాపాడేందుకు అన్ని విధాలా వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో శివప్రసాద్ మృతి చెందారు. అడ్మిట్ అయినప్పటి నుంచి ఆయన వెంటిలేటర్పై ఉన్నారు.
రాజకీయంగా టీడీపీ వాయిస్ సభలో వినిపించే అవకాశం లేకపోయినా..తన వేష ధారణలతో పార్లమంట్ ప్రాంగణంలో అందరినీ ఆకర్షించేవారు. పద్యాలు పాడుతూ..తన నిరసన వ్యక్తం చేసేవారు. ఏపీకి విభజన హామీలు అమలు కోసం వేష ధారణతో సభలోకి వచ్చి.. స్పీకర్ పోడియం దగ్గరకు రావటంతో శివ ప్రసాద్ మీద స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న శివ ప్రసాద్ మరణం ఇటు చిత్తూరు ప్రజల్లో అటు టీడీపీలో విషాదం నింపింది.