విషాదం.... తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య... అదే కారణం...?
గుంటూరు పట్టణ కేంద్రంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ టీవీ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ(42) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక పరిస్థితులే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... రేఖకు చిన్నప్పటినుంచి సినీ రంగంలో రాణించాలన్న ఆసక్తి ఉండేది. నటిగా,గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె... కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి సినీ రంగంలో ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలో రెండు టీవీ సీరియల్స్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వచ్చేశారు.
పట్టణానికే చెందిన అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొన్నేళ్లకు భర్తతో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పలు ఈవెంట్స్లో గాయనిగా,యాంకర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో చైతన్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి విద్యానగర్లో నివాసం ఉంటున్నారు.
పెళ్లి తర్వాత రేఖ ఈవెంట్స్ చేయడం మానేశారు. చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఇటీవలి కాలంలో చైతన్య వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో రేఖ కూడా మానసికంగా కుంగిపోయింది. బుధవారం(జూలై 22) ఉదయం బాత్రూమ్కి వెళ్లిన ఆమె... అందులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Recommended Video
భార్య ఎంతసేపటికీ బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో చైతన్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా.. లోపల ఉరివేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.