వైఎస్ఆర్ సీపీలోకి మరో కేంద్రమాజీ మంత్రి..అసెంబ్లీ టికెట్ కూడా ఖరారు
అమరావతి: ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ సరికొత్త చేరికలతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంటోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి పలువురు సీనియర్ నాయకులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. మరికొందరు ముహూర్తాలను చూసుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీన తాను వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నట్లు కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి జగన్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆమే.. పనబాక లక్ష్మి. డాక్టర్ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పెట్రోలియం, జౌళి పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
నాలుగుసార్లు లోక్ సభకు..
కాంగ్రెస్ పార్టీలో పనబాక లక్ష్మీ సీనియర్. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా తన ఉనికిని దాదాపుగా కోల్పోయిన సీనియర్ నాయకుల్లో ఆమె ఒకరు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాపట్ల నుంచి లోక్ సభకు పోటీ చేసి, దారుణంగా ఓడిపోయారు. బాపట్ల సిట్టింగ్ ఎంపీ పనబాకకు ఆ ఎన్నికల్లో కేవలం 23 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నప్పటికీ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
భర్తతో కలిసి వైఎస్ఆర్ సీపీ వైపు..
రాజకీయాల్లో కొనసాగాలంటే కాంగ్రెస్ ను నమ్ముకుంటే పని కాదనే నిర్ణయానికి వచ్చారు. విభజన చోటు చేసుకున్న అయిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పూ రాలేదు. దీనితో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాల్సిన స్థితిని ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి వైఎస్ఆర్ సీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పనబాక కృష్ణయ్య ఐఆర్టీఎస్ మాజీ అధికారి. దక్షిణ మధ్య రైల్వేలో చాలాకాలం పాటు ముఖ్య సమాచార, పౌర సంబంధాల అధికారిగా పనిచేశారు. సర్వీసులో ఉండగానే.. రాజీనామా చేశారు. రాజకీయాల్లో చేరారు. 2009లో నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు.
ఆనం ప్రోద్బలంతోనే..
పనబాక లక్ష్మీ, పనబాక కృష్ణయ్య దంపతులను వైఎస్ఆర్ సీపీలో చేర్చేలా జిల్లాకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనకు రెండు సీట్లను కేటాయిస్తే.. పార్టీలో చేరడానికి అభ్యంతరమేమీ లేదని పనబాక లక్ష్మి చెబుతున్నారట. గూడూరు అసెంబ్లీతో పాటు నెల్లూరు లేదా బాపట్ల లోక్ సభ స్థానాన్ని గానీ, లేదా మరో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గూడూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ సీపీకి గట్టి అభ్యర్థి లేరు.
గూడూరు అడుగుతున్న పనబాక
ప్రస్తుత ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైఎస్ఆర్ సీపీ నుంచే గెలుపొందినప్పటికీ.. ఆయన పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. దీనితో ప్రత్యామ్నాయం చూసుకుంటోంది వైఎస్ఆర్ సీపీ. ఈ స్థానాన్ని తమ కుటుంబానికి ఇవ్వాలనేది పనబాక లక్ష్మి డిమాండ్. దీనితో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని లేదా లోక్ సభ సీటును ఇవ్వాలని కోరుతున్నారట. దీనికి అంగీకరిస్తే, పనబాక ఈ నెలాఖరులోగా వైఎస్ఆర్ సీపీలో చేరవచ్చని సమాచారం. గూడూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆమెకు భరోసా ఇస్తున్నారు గానీ మరో సీటు విషయంలో హామీ ఇవ్వట్లేదని తెలుస్తోంది.