జగన్ కు కొరుకుడు పడని మరో క్యారెక్టర్- 10 నెలలుగా తెరవెనుక ఉంటూనే సర్కారుకు చుక్కలు.. ?
గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉన్న పలువురు అధికారులు, నామినేటెడ్ ఛైర్మన్లు సీఎం జగన్ కు కంట్లో నలుసుగా మారిపోతున్నారు. అయితే వీరి విషయంలో సర్కారు ఏమీ చేయలేని పరిస్ధితులు ఉండటం వారికి కూడా కలిసి వస్తోంది. ఇదే కోవలో ఏపీపీఎస్సీ, శాసనమండలి ఛైర్మన్లు, ఎన్నికల కమిషనర్ తో పాటు తాజాగా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కూడా కనిపిస్తున్నారు. వీరి విషయంలో జగన్ సర్కారు ఏం చేయబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
జలీల్ ఖాన్ విలక్షణ శైలి..
విజయవాడతో పాటు ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు జలీల్ ఖాన్. బీకాం ఫిజిక్స్ డైలాగ్ తో సుపరిచితుడైన ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల్లో పనిచేశారు. కాంగ్రెస్ లో ఓసారి గెలిచి, మరోసారి ఓడిన జలీల్ ఖాన్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక టీడీపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన స్ధానంలో కుమార్తె షబానాతో పోటీ చేయించినా ఫలితం లేకపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఆమె ఓటమిపాలైంది. అయితే అప్పటికే టీడీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి దక్కించుకున్న జలీల్ ఖాన్.. వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని వదులుకోవాలని భావించారు. అయితే టీడీపీ సూచనతో రాజీనామా చేయకుండా ఇప్పటికీ కొనసాగుతున్నారు.
వక్ఫ్ బోర్డ్ రాజకీయం.. జలీల్ పాత్ర..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి ఫిరాయించిన జలీల్ ఖాన్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవిలో నియమించారు. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం పనిచేసే ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి విలువ అప్పట్లో ఆయనకు తెలియలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జలీల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదెంత పవర్ ఫుల్లో వైసీపీ ప్రభుత్వ పెద్దలకు అర్దమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం నియమించిన పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేసేశారు. కానీ జలీల్ ఖాన్ కు ఆ భయం లేదు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటైన వక్ఫ్ బోర్డ్ లో పదవులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు ఇదే అంశం జలీల్ ఖాన్ కు కలిసి వస్తుండగా.. జగన్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది.
వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపుల్ల..
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మైనార్టీల అభ్యున్నతి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని అమలు చేసే క్రమంలో వక్ఫ్ బోర్డ్ పాత్ర కీలకమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మసీదుల పాలక కమిటీలను నియమించే, తొలగించే అధికారం వక్ఫ్ బోర్డుదే. వాటికి నిధుల కేటాయింపుతో పాటు జీత భత్యాల వ్యవహారం కూడా బోర్డు ప్రతినిధుల చేతుల్లోనే ఉంటుంది. అంతే కాదు మసీదులకు అనుబందంగా ఉన్న వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కూడా బోర్డు చేతుల్లోనే ఉంటాయి. ఉర్దూ అకాడమీ వంటి సంస్ధల వ్యవహారాలు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంటాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు తప్పిదాలను తవ్వే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జలీల్ ఖాన్ నేతృత్వంలోని వక్ఫ్ బోర్డు సభ్యులు అడ్డుకుంటున్నారు.
Recommended Video
ప్రతీ నిర్ణయంపై హైకోర్టులో పోరాటమే..
వైసీపీ ప్రభుత్వం మైనార్టీ వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం దాన్ని ఏదో రకంగా వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడమే లక్ష్యంగా వక్ఫ్ బోర్డు వ్యవహారాలు సాగుతున్నాయి. అంతే కాదు బోర్డు తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా బోర్డు సభ్యులు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ సర్కారు ఏమీ చేయలేక చేష్టలుడిగి చూసే పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో జలీల్ ఖాన్ తీరును బహిరంగంగా తప్పుబట్టలేక, అలాగని రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన్ను తప్పించలేక ప్రభుత్వం సతమతమవుతోంది. కానీ జలీల్ ఖాన్ మాత్రం ఒక్కమాట మాట్లాడకుండా తను కావాలనుకున్న పని చేసుకుంటూ వెళ్లిపోతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.