విజయవాడలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణం...రేపే శంఖుస్థాపన:ప్రత్యేకతలు ఇవే!
విజయవాడ: విజయవాడలో నిర్మించనున్న అమరావతి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఈ నెల 24న శంకుస్థాపన చేయనున్నట్లు శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బంగార్రాజు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. ఇందులో అంతర్భాగంగా మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం తరహాలో ఆధునిక హంగులతో ఈ క్రీడా మైదానాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. స్పోర్ట్ క్లబ్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి సభ్యత్వం కల్పిస్తామని బంగార్రాజు వివరించారు.
జూలై 24 మంగళవారం విజయవాడ విద్యాధరపురంలో జరిగే అమరావతి ఇంటర్నేషనల్ స్టేడియం శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఎం చంద్రబాబు హాజరవుతారని, ఇందులో భాగంగా ప్రాజెక్ట్ గాండీవ, పాంచజన్యలను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బంగార్రాజు చెప్పారు. ఈ మైదాన నిర్మాణ పనులను సీపీడబ్ల్యూసీకి అప్పగించామని తెలిపారు. విదేశాలకు చెందిన ప్రతిభ కలిగిన శిక్షకులతో ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి, వచ్చే ఒలింపిక్స్లో ఏపీ క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు.
ఇదే విషయమై మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ 8.9 ఎకరాలలో రూ.60 కోట్లతో స్టేడియం నిర్మాణం ఉంటుందన్నారు. స్పోర్ట్స్ సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతిని అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గాండీవా ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిసారిగా ఎపిలోనే రూపుదిద్దుకుంటోదన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశమని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.