తుళ్ళూరు ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రి, వచ్చేనెల శంకుస్థాపన: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ లోని తుళ్ళూరు ప్రాంతంలో వచ్చే నెలలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. హైదరాబాద్ లోని బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి తరపున ఆస్పత్రి ఛైర్మన్, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 69వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జాతీయ జెండాను అవిష్కరించి ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరు ప్రాంతంలో వచ్చే నెలలో బసవతారకం పేర ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టు వెల్లడించారు. రెండేళ్లలో ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
ఈ ఆస్పత్రి కోసం ఏపీ ప్రభుత్వం 15ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు. ఈ సందర్భంగా తమకు ఎంతగానో సహకరిస్తున్నతెలంగాణ,ఎపి ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.తమకు ఉన్నదానిలో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకి సహాయం చేసేందుకే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి , రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించామని తెలిపారు.
జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమేనని అన్నారు. దేశం గురించి మాట్లాడేటప్పుడు, స్ఫూర్తిని పంచుకునేటప్పుడు అతిథులు అంటూ ఎవరూ ఉండరని, అందరూ ఆత్మీయులేనని బాలకృష్ణ అన్నారు.