మాకు రక్షణేది?, సీఎం కావాలని..అన్నింటికీ సిద్ధపడే: చంద్రబాబు ‘కొనుగోళ్ల’పై పవన్ ఆగ్రహం
శ్రీకాకుళం: గంగమ్మ పూజతో తన యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు సంస్కృతి, సాంప్రదాయాలంటే ఇష్టమని చెప్పారు. మత్స్యకారులు సంప్రదాయాలతో యాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల కోసం తాను యాత్ర చేయడం లేదని, ఇది సోషియో పొలిటికల్ మూమెంట్ అని పవన్ అన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం అవసరమని ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్తో మాట్లాడుతూ చెప్పారు.
ప్రభుత్వాలపై కోపం, కడుపు మంటతోనే జనం తనతో కలిసి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిజయోవర్గాల్లో తన ప్రజా కవాతును కొనసాగిస్తామని పవన్ కళ్యాన్ తెలిపారు. గిరిజన మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కనీసం టాయ్లెట్ల సౌకర్యం కూడా వారికి అందుబాటులో లేవని అన్నారు. వీటి కోసం కేంద్ర పథకాలున్నాయని, నిధులు కూడా ఉన్నాయని.. అయితే అమలు చేయడంలోనే లోపాలున్నాయని అన్నారు.
ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం, విద్యా, వైద్యం ప్రభుత్వాలు అందించాలని పవన్ అన్నారు. గైనకాలజిస్టులు లేక మహిళలు, యువతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ అన్నారు. మహిళలు తనకు వారి సమస్యలు ఓ కుటుంబసభ్యుడిగా తెలిపారని చెప్పారు. హామీల అమలు కోసం ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని అన్నారు.
సీఎం కావాలని కోరుకుంటున్నారు..
ప్రభుత్వాల్లో జవాబుదారీతనం పెరగాలని అన్నారు. హోదాతోపాటు రాష్ట్రంలోని సమస్యలపై పోరాటం సాగుతుందని పవన్ అన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే తాను సీఎం అవుతానని చెప్పానని పవన్ తెలిపారు. ఇది సరైన సమయం కాబట్టే సీఎం కావాలని అనుకుంటున్నట్లు ప్రకటన చేశానని చెప్పారు. తన అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని పవన్ వివరించారు.
అందుకే బాబును ప్రశ్నిస్తున్నా..
తన అనుభవంతో ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే మద్దతు తెలిపానని, అయితే, ఇప్పుడు అనుకున్న విధంగా ప్రజలకు ప్రయోజనం కలగకపోవడంతోనే చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని పవన్ తెలిపారు. ప్రశ్నిస్తానని ముందే చెప్పాను.. అందుకే ప్రశ్నిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడాలని అన్నారు.
రక్షణ ఇవ్వడం లేదు? అన్నింటికి సిద్ధపడే
ప్రభుత్వం తనకు రక్షణ ఇవ్వడం లేదని పవన్ అన్నారు. జనంలో కవాతు చేస్తుంటే ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. తనకు గానీ, జనానికి గానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని నిలదీశారు. విధులు నిర్వహించకుండా పోలీసులను ప్రభుత్వమే అడ్డుకుంటోందని అన్నారు. అయితే, తాను అన్నింటికి సిద్ధపడే జనంలోకి వచ్చానని పవన్ తెలిపారు. తాను బస చేస్తున్న కళ్యాణ మండపానికి కూడా సెక్యూరిటీ లేదని అన్నారు. జనసేన కార్యర్తలు, అభిమానులు కూడా పవన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు కొనుగోళ్లపై పవన్
కర్ణాటకలో ఎమ్మెల్యేల బేరసారాలపై పవన్ స్పందిస్తూ.. ఇది రాజకీయాల్లో తొలిసారేం కాదని అన్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటివి అన్ని రాజకీయ పార్టీలు చేశాయని అన్నారు. ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయడం సరికాదని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా వైసీపీ ఎమ్మెల్యేలను అవసరం లేకున్నా తన పార్టీ టీడీపీలో చేర్చుకున్నారని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీని కొనుగోలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు.. ఎన్టీఆర్ను ఇలాంటి రాజకీయాలతోనే పదవీచిత్యున్ని చేశారని పవన్ తెలిపారు.
తాను మధ్యతరగతి వాడినే..
రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని పవన్ అన్నారు. కొనుగోళ్లు ఆపేయాలని, ఇలాంటి రాజకీయాలపై అసహ్యం వేస్తోందని అన్నారు. అలాగే యువతలో కూడా మార్పు రావాలని, ప్రభుత్వాలను ప్రశ్నించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు హామీలు నెరవేర్చాలని, లేదంటే ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. తాను ఎప్పుడూ దిగువ మధ్యతరగతి వాడిగానే ఉంటానని.. ఏసీలు, విలాస జీవితం లేకున్నా తాను సాధారణ జీవితం గడపగలనని అన్నారు. తనకు నేలకు సంబంధం ఉందని చెప్పారు.