విశాఖలో విషాదం:ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
విశాఖపట్టణం నక్కపల్లి మండలం ఉపమాక ఎస్సీ కాలనీలో ఘోర విషాదం చేటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకని దిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే...
ఉపమాక ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రకోట అప్పారావు ఇంటి సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది. దీంతో ఆ ఇంటివారే సమస్య నివారణకు నడుంబిగించారు. వారికే చెందిన మరో సెప్టిక్ ట్యాంక్లోకి ఈ ట్యాంక్ లోని అశుద్దాన్ని తోడిపోయాలనే ఉద్దేశ్యంతో ముందుగా కాండ్రకోట అప్పారావు(50) సెప్టిక్ ట్యాంకులోకి దిగాడు.
అయితే అతడు ఒక్కసారిగా ట్యాంకులో పడిపోవడంతో అతడిని కాపాడటం కోసం అతడి కుమారుడు కాండ్రకోట రాజశేఖర్ (28) కుటుంబ సభ్యులు కాండ్రకోట కృష్ణ (30), కాండ్రకోట నాగేశ్వరరావు (35) సత్తిబాబు సెప్టిక్ ట్యాంకులోకి దూకారు. దీంతో వీరందరు బైటకి రాకపోతుండటంతో స్థానికులు వీరిని బైటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే వీరిలో సత్తిబాబు అనే వ్యక్తి తప్ప మిగిలిన వారందరూ మృత్యువాతన పడ్డారు. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో తమ కుటుంబానికి చెందిన నలుగురు మరణఇంచడంతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.