ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి...ఉద్యోగ నియామకాలే ఉసురు తీసాయి
ప్రకాశం జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కర్నూలుకు చెందిన ఇండ్ల వాసు విజయలక్ష్మి(40), మట్టా శ్రీనివాస రాఘవేంద్ర (42), ఆయన భార్య కృష్ణవేణి(40), కారుడ్రైవర్ దాసరి ఉపేంద్ర రెడ్డి (25)గా గుర్తించారు.
వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మూడు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఘటన వెనుక ఆసక్తికర కోణం వెలుగు చూసింది. ప్రమాదంలో చనిపోయిన నలుగురులో వ్యక్తుల్లో ఇద్దరు మహిళలు కాగా...వీరికి ఇటీవల వచ్చిన ఉద్యోగాలే వీరి ఉసురు తీయడానికి కారణమైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో విజయలక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్నారు. ఆమె భర్త విజయకుమార్ పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్. మరో మహిళ కృష్ణవేణి రాయలసీమ యూనివర్సిటీలోనే కాంట్రాక్ట్ లెక్చరర్గా పని చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేంద్ర కర్నూలు బొంగుల బజార్లో 'పల్లవి గార్మెంట్స్' పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. వీరు గుత్తి రోడ్డు రైల్వేగేట్ సమీపంలో ఉన్న వీసీ అపార్టుమెంట్లో ఉంటున్నారు.
అయితే కృష్ణవేణి, విజయలక్ష్మి ఇటీవల డిగ్రీ లెక్చరర్లు గా ఎంపికయ్యారు. వీరితోపాటు ఉత్తీర్ణులైన వారికి ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ లు వచ్చాయి. అయితే కారణాలేమిటో తెలియదు కాని కృష్ణవేణి, విజయలక్ష్మికి మాత్రం ఇంకా అపాయింట్ ఆర్డర్స్ రాలేదు. ఈ విషయం అధికారులను సంప్రదించగా పరిష్కారం కోసం విద్యా శాఖ కమిషనర్ను కలవాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో కృష్ణవేణి, తన భర్త రాఘవేంద్రతో పాటు, మరో ఉద్యోగిని విజయలక్ష్మితో కలిసి బుధవారం తెల్లవారుజామున కమీషనర్ ను కలిసేందుకు విజయవాడకు బయలుదేరారు. కారు డ్రైవర్గా కల్లూరుకు చెందిన డ్రైవర్ ఉపేంద్రరెడ్డిని తీసుకుని వెళ్లారు.
అయితే వీరు ప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా వెల్లంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ఉపేంద్రరెడ్డి (21) కూడా ఐటీఐ చదువుతున్నట్లు తెలిసింది. అతడు రెగ్యులర్ డ్రైవర్ కాకున్నా పిలిచింది తెలిసిన వారు కావడంతో వెంటనే కారు నడిపేందుకు వెంట వెళ్లాడు. ఉద్యోగ నియామకాల ఉత్తర్వుల కోసం బయలుదేరి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.