కృష్ణా నదిలో నలుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు: గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్
కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కృష్ణానదిలో నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సరదాగా గడిపేందుకు ఐదుగురు విద్యార్థులు పవిత్ర సంగమం వద్దకు చేరుకున్నారని, అయితే, అక్కడ ఏర్పాటు చేసిన రైలింగ్ దాటి ఓ విద్యార్థి చేసిన ప్రయత్నమే ఈ ప్రమాదానికి కారణమని జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా తెలిపారు.
శనివారం రాత్రి కూడా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ బృందాలతో పాటు స్థానిక నాటు పడవలు, గజ ఈతగాళ్లు.. మొత్తం 100 మందితో గాలిస్తున్నట్టు చెప్పారు. నదిలో అక్కడక్కడా తుప్పలు, చెట్లు ఉండటం వల్ల వారు సురక్షితంగానే ఉంటారనే ఆశతో ఆదివారం కూడా గాలింపు కొనసాగిస్తామని తెలిపారు.
తొలుత ఒక విద్యార్థి రైలింగ్ దాటి అవతలివైపు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని, అతడిని కాపాడే ప్రయత్నంలో వెళ్లిన మరో ముగ్గురు విద్యార్థులు కూడా గల్లంతయ్యారని తెలిపారు. పట్టిసీమ నుంచి వచ్చిన నీరు ఇక్కడ కృష్ణానదిలో కలవడంతో నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంవల్లే వాళ్లు ఆ నీటిలో కొట్టుకుపోయారని తెలిపారు.
గల్లంతైన విద్యార్థుల్లో ప్రవీణ్(18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19) ఉన్నారు. ఆ విద్యార్థులు శనివారం నాడు కళాశాలకు రాలేదని యాజమాన్యం తెలిపిందని చెప్పారు. ఇప్పటివరకైతే విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదని, గాలింపు చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థులు 1కి.మీల పరిధిలోనే ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని వేడుకుంటున్నారు.