ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు- అల్పపీడన ప్రభావం- సర్కార్ హెచ్చరికలు..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా ఇప్పటికే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత తీవ్రమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగురోజుల్లో భారీ వర్షాలు తప్పవని అధికారులు ప్రకటించారు.
Recommended Video
వాయువ్య బంగాళాఖాతంలో రేపు పూర్తి స్ధాయిలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముందని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
భారీ వర్షాల ప్రభావం రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలపైనా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాయలసీమలో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. కోస్తా జిల్లాల్లోనూ ఉత్తరాంధ్ర మినహా మిగిలిన చోట్ల పరిస్ధితి మెరుగ్గానే ఉంది. తాజా వర్షాలతో రైతుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లతో పాటు ఆర్డీవో కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు కలెక్టర్లు సూచిస్తున్నారు.