శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి:ప్రభుత్వం హెచ్చరికలు
శ్రీకాకుళం: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందారు. పాతపట్నం మండలం తిడిమిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మృతులు హేమసుందర్(18), మనోజ్కుమార్(17)లుగా గుర్తించారు. అలాగే మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురంలో బస్షెల్టర్పై పిడుగుపడి మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆనందరావు, పోలిరాజుగా గుర్తించారు.
అంతకుముందే శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పలాస, సోంపేట, హిరమండలం, మందస, టెక్కలి, సర్వకోట, కోటబొమ్మాళి, కొత్తూరు పరిసరాల్లో పిడుగులుపడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, కడప, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, రాజంపేట, వీరబల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లిలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
నెల్లూరు జిల్లాలో డక్కిలి, ప్రకాశం జిల్లాలో పెదచెర్లోపల్లె, తూర్పుగోదావరి జిల్లా రాయవరం, కరప, బిక్కవోలు, విశాఖపట్నం జిల్లా రోలుగుంట, చోడవరం, దేవరపల్లె, విశాఖ రూరల్, విశాఖ అర్బన్, విజయనగరం జిల్లా జామి, వేపాడ మండలాల పరిసరప్రాంతాల్లో పిడుగులుపడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని పేర్కొంది.