కరోనా వైరస్ : ఏపీలో నలుగురు వైద్యులకు పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్లో నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. అనంతపురం జిల్లాలో బుధవారం(ఏప్రిల్ 8) ఒక్కరోజే 7 కొత్త కేసులు నమోదవగా.. అందులో నలుగురు వైద్యులే కావడం గమనార్హం. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్గా తేలిందని డీఎంహెచ్ఓ అనిల్ కుమార్ వెల్లడించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేటప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల వైద్యులకు కరోనా సోకిందన్నారు.
హిందూపురానికి చెందిన ఓ వ్యక్తి(58) ఇటీవల కరోనాతో మృతి చెందాడని.. తాజాగా కరోనా సోకిన నలుగురు వైద్యులు అతనికి చికిత్స అందించారని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 34 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 348కి చేరింది. ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో మరో కేసు నమోదవడంతో.. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 75కి చేరింది.
కరోనా వైద్య పరీక్షలను వేగవంతం చేసేందుకు రాష్ట్రంలో తయారుచేసిన కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.