ఒకరు రేప్, అతనితో కల్సిన వీడియోలున్నాయని మరో ముగ్గురు
హైదరాబాద్: పదహారేళ్ల బాలిక పైన హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. నమ్మించి ఒకరు, మోసం చేసి మరో ముగ్గురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోసం చేయగా దీనిని సాకుగా చూపి మరో ముగ్గురు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ఈ ఘాతుకానికి నాలుగు నెలలుగా పాల్పడుతున్నారు.
నిందుతుల్లో ఒకరు ఆ బాలికను అపహరించి కాపురం పెట్టాడు. దీంతో బాలిక అపహణరకు గురైందని బంధువులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల అరెస్టుతో మంగళవారం ఇది వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 40లోని ఓ వ్యాపారి ఇంట్లో 40 ఏల్ల వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెతో కొంతకాలంగా పని చేస్తున్నాడు.
ఇదే ఇంట్లో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా పల్లెప్రోలుకు చెందిన మడగల సుధీర్ (30) అదే జిల్లా వల్లూరుకు చెందిన భవానీ శ్రీనివాసులు (23), బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2కు చెందిన సిద్ధిరాములు అలియాస్ సిద్దు (29), మాదాసు శంకర్ (31) కారు డ్రైవర్లుగా, సూపర్ వైజర్లుగా పని చేస్తున్నారు. సూపర్ వైజర్గా పని చేస్తున్న సిద్ధు బాలికకు మాయమాయలు చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న సిద్ధు స్నేహితుడు శ్రీనివాసులు ఆ బాలిక సిద్ధుతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, యజమానికి చెబుతానంటూ బెదిరించి ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ వద్ద కూడా ఫోటోలు ఉన్నాయని శంకర్, సుధీర్లు కూడా ఆ యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సిద్ధు గత డిసెంబర్ 22న తన వద్దనున్న ఫోటోలు ఇస్తానని చెప్పి బాలికను బోరబండలోని తన గదికి తీసుకు వెళ్లాడు.
అక్కడ ఇంటి యజమానితో భార్యాభర్తలమని చెప్పి బాలిక పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బోరబండలో బాలిక ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆమెను విడిపించారు. బాలిక నుండి ఫిర్యాదు తీసుకొని మిగతా ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా, వారికి రిమాండ్ విధించారు.