రాష్ట్రానికి నలుగురు కొత్త ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారులందరూ ఒక్కొక్కరుగా రాష్ట్రానికి తిరిగి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా మరో నలుగురిని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా శిక్షణను పూర్తి చేసుకున్న నలుగురికి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ను కేటాయిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2015 బ్యాచ్కు చెందిన నలుగురికి ఏపీ క్యాడర్ను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అంజన్ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కె అరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, గౌతమి సలీ, రాహుల్ దేవ్ సింగ్లకు ఏపీ క్యాడర్ను కేటాయించింది కేంద్రం.
కాగా- ఇప్పటికే కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాష్ట్రానికి తిరిగి రావడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. 1992 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన పీ సీతారామాంజనేయులును ఇప్పటికే కేంద్రం రిలీవ్ చేసింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ కూడా చేశారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. ఆయనకు త్వరలోనే పోస్టింగ్ ఇవ్వనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి వీఎస్ కౌముది కూడా త్వరలోనే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.