వివాదాల కేంద్రం కడప కేంద్ర కారాగారం: 20అడుగుల గోడదూకి ఖైదీల పరారీ, రాజప్ప ఆగ్రహం
కడప: జిల్లాలోని కేంద్ర కారాగారం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఖైదీలకు సెల్ఫోన్లు, సిమ్కార్డులు, సెల్ ఛార్జింగ్, బీడీలు, మద్యం తదితర వస్తువులు అందుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం నలుగురు ఖైదీలు 20 అడుగుల ఎత్తున ఉన్న గోడ దూకి పరారయ్యారు.
తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీల పరారీపై చినరాజప్ప విచారణకు ఆదేశించారు. పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. కడప కేంద్రకారాగారంలో చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్ర, హనుమంతు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రవి, దేవ వివిధ రకాల కేసుల్లో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్నారు. వీరు నలుగురూ ఒకే బ్లాక్లో ఉంటారు. ఇక్కడే వీరు స్నేహితులయ్యారు. గత కొద్ది రోజుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ నిచ్చెనను తయారు చేసుకున్నారు.
జైలు చుట్టూ ఆరు సెంట్రీ గదులున్నాయి. వాటిల్లో 24గంటల పాటు భద్రతా సిబ్బంది బందోబస్తు ఉండాలి. సిబ్బంది కొరత వల్ల గత కొంత కాలం నుంచి సెంట్రీ టవర్ల వద్ద సిబ్బంది ఉండటంలేదు. సోమవారం సాయంత్రం ఖైదీలందరినీ లాకప్ చేసే సమయంలో.. ఈ నలుగురు.. సిబ్బంది కళ్లుగప్పి జైలు ప్రహరీ చివర ఉన్న సెంట్రీ టవర్కు వెళ్లారు.
గోడ చుట్టూ విద్యుత్తు కంచె ఉంది. అయినా, తెలివిగా సెంట్రీ టవర్కు నిచ్చెన వేశారు. కాగా, సెంట్రీ టవర్కు విద్యుత్తు సరఫరా ఉండదు. గోడ సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంది. సాయంత్రం కావడంతో ఎవరికీ కనిపించలేదు. నిచ్చెన సహాయంతో గోడదూకి అటవీ ప్రాంతం వైపు పరారయ్యారు. కొద్ది సేపటికి ఖైదీల సంఖ్య తక్కువగా ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
విషయం అధికారుల దృష్టికి తెలియడంతో.. వారు హుటాహుటిన జైల్లో గాలింపు చర్యలు చేపట్టారు. జైలు చివరి ప్రహరీ వద్ద ఉన్న సెంట్రీ టవర్ వద్దకు వెళ్లారు. అక్కడ నిచ్చెన కనిపించడంతో ఆ నలుగురు ఖైదీలు పరారైనట్లు ధ్రువీకరించారు. ఖైదీల పరారీలో జైలు సిబ్బంది హస్తం ఉందనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీజీ కృష్ణంరాజు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నలుగురు ఖైదీలు పారిపోతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వారిని వెతికి పట్టుకోవాలని ఆదేశించారు. ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం కడప రిమ్స్లో ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న బాలాజీ అనే జీవిత ఖైదీ పరారయ్యాడు.