హర్ష, ఎస్పీవై వెనక్కి: స్పీకర్తో రిజైన్లకు నలుగురే భేటీ
న్యూఢిల్లీ: నలుగురు సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు స్పీకర్ మీరా కుమార్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. హర్షకుమార్, ఎస్పీవై రెడ్డి వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, సాయంత్రం వరకు ఆ సంఖ్య తేలుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ విడివిడిగా స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. తమపై ఏ ఒత్తిడీ లేదని, స్వచ్ఛందంగా రాజీనామా చేశామని, తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ను కోరినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో చెప్పారు.
తమ రాజీనామాలు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. సబ్బం హరి, ఎస్పీవై రెడ్డి తమకు నైతిక మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. రాజీనామాలపై స్పీకర్ను కలవడంతో తమ విధి పూర్తయిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాదనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ఎవరినీ తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదని, తాము పదవుల కోసం రాలేదని ఉండవల్లి అన్నారు. నువ్వు జర్నలిస్టువు, నేను రాజకీయ నాయకుడిని అని మరిచిపోతే విజయం సాధిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
మీ మీదే మా భవిష్యత్తు ఆధారపడి ఉందని, మీరు చెప్పినట్లే నడుచుకుంటామని ఉండవల్లి మీడియా ప్రతినిధులతో వ్యంగ్యంగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని, ఉన్న విషయాలు చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలో విడదీయలేనంతగా లింకులు ఏర్పడ్డాయని, అదే విషయం ముఖ్యమంత్రి చెప్పారని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశంతోనే రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు ఉండవల్లి చెప్పారు.
సిడబ్ల్యుసి నిర్ణయం తమ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని రాజీనామాలు చేశామని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. తమ పోరాటం వల్లనే తెలంగాణ ప్రక్రియ ఇంత వరకు ఆగిందని, అది ముందుకు సాగదని అనుకుంటున్నామని ఆయన అన్నారు. విభజనను ఆపేందుకే రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించాల్సిన నైతిక బాధ్యత స్పీకర్కు ఉందని ఆయన చెప్పారు. సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్ కూడా మీడియాతో మాట్లాడారు.
తమ రాజీనామాల వెనక ఎవరి ఒత్తిడీ లేదనీ, ప్రజల కోసం తాము రాజీనామాలు చేస్తున్నామని స్పీకర్కు చెప్పినట్లు లగడపాటి రాజగోపాల్ చెప్పారు.