కృష్ణా నదిలో ఈతకు దిగి నలుగురు విద్యార్థుల మృత్యువాత
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెండ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని చూసేందుకు వెళ్లిన విద్యార్థులు సరదాగా ఈత కొడదామనుకున్నారు. కానీ నదిలోకి దిగి మృత్యువాత పడ్డారు.
కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. దీంతో నదిని చూసేందుకు చిర్రావూరుకు చెందిన ఏడుగురు విద్యార్థులు వెళ్లారు. ముగ్గురు ఒడ్డున నిలబడ్డారు. నలుగురు నదిలో స్నానానికి వెళ్లారు. కానీ వరద ఉద్ధృతికి వీరు కొట్టుకుపోయారు.
తాడేపల్లి మండల కేంద్రం నుంచి తొమ్మిది కి.మీ. దూరంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీరు వదలడంతో చూసేందుకు వారు ఆటోలో వెళ్లారు. ఆటో దిగిన తర్వాత సరదాగా ఈత కొడదామని భావించిన నలుగురు నీటిలోకి దిగి గల్లంతయ్యారు.
వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. వారంతా ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. వారు శివ, క్రాంతి కుమార్, నీలం శశి, దినేష్లుగా గుర్తించారు. ఘటనాస్థలికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, పోలీసులు చేరుకున్నారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.