అమెరికాలో వర్సిటీల వీసా ఫ్రాడ్: నలుగురు తెలుగువాళ్ల పాత్ర
హైదరాబాద్: అమెరికావ్యాప్తంగా భారీ స్థాయిలో వెలుగు చూసిన హెచ్ -1బి వీసా ఫ్రాడ్లో నలుగురు తెలుగువాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. భారత సంతతికి లేదా భారతీయ అమెరికన్లకు సంబంధించిన ఈ వీసా కుంభకోణం మంగళవారంనాడు వెలుగు చూసింది. తెలుగువాళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
అమెరికాలోని ఈ నకిలీ వర్సిటీ వీసాల ఫ్రాడ్లో అరెస్టైన వారిలో పది మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వెయ్యి మందికిపైగా విదేశీయులకు విద్యార్థి, కార్మిక వీసాలను అక్రమంగా అందించినట్లు గుర్తించారు. మధ్యవర్తులు, ఉద్యోగ సంస్థల అధిపతులు, నియామకులు సహా 21 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల పేర్లతో కూడిన జాబితాను బుధవారం వారు విడుదలచేశారు.
పది మంది భారతీయ అమెరికన్లు లేదా భారత సంతతి ప్రజలు ఉన్నట్లు ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. నిందితుల్లో తేజేశ్ కొడాలి, కార్తిక్ నిమ్మల, గోవర్ధన్ ద్యావరశెట్టి, అవినాశ్ శంకర్ అనే తెలుగువాళ్లని తెలుస్తోంది. సయ్యద్ ఖాసీం అబ్బాస్ తదితర చైనా, భారత్కు చెందినవారి పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ కుంభకోణాన్ని విస్తృత దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినట్లు న్యూజెర్సీ అటార్ని పాల్ జె.ఫిష్మ్యాన్ తెలిపారు.
అక్రమ మార్గంలో వీసాల మంజూరు చేయిస్తున్న వారిని పట్టుకునేందుకు అమెరికా అంతర్గత భద్రతా విభాగం మొదట ఓ నకిలీ వర్సిటీని సృష్టించిందని చెప్పారు. 2013లో ఉత్తర న్యూజెర్సీ విశ్వవిద్యాలయం పేరిట క్రాన్ఫోర్డ్లో దీన్ని తెరిచిందని, ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన నిందితులు26 దేశాలకు చెందినవారికి వీసాలు ఇప్పించేందుకు దీన్ని అక్రమంగా వాడుకున్నారని చెప్పారు.