టిడిపితో ఘర్షణ: కర్ణాటకలో వైసిపి కార్యకర్తల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలు కర్ణాటకలోని చింతామణి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ నలుగురు కూడా కడప జిల్లాకు చెందినవారు. మృతులను కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లి వాసులుగా గుర్తించారు.
రేషన్ విషయంలో ఈనెల 11న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసిపి కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తొండూరు పోలీస్స్టేషన్లో 9మందిపై కేసు నమోదైంది.
కేసులో ఇరుక్కున్న నలుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కర్ణాటకకు పారిపోయారు. అక్కడ తలదాచుకుంటున్న వారు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అరుణ్ కాంత్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రారెడ్డిలుగా గుర్తించారు.