కారుతో రెచ్చిపోయిన పోకిరీలు: వెంటాడి ప్రాణం తీశారు
విశాఖపట్నం: జిల్లాలోని అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నూకాంబికా అమ్మవారి దర్శనానికి ఓ యువకుడి బైక్పై వెళ్లి వస్తున్న ఇద్దరు యువతులను కొందరు పోకిరీలు వేధించారు. అంతేగాక, వారి కారుతో వెంబడించి యువతుల వెంట ఉన్న యువకుడితో గొడవ పెట్టుకున్నారు.
అంతటితో ఆగని ఆ పోకిరీలు.. యువతులు సదరు యువకుడి బైక్పై వెళుతుండగా వెంబడించి కారుతో ఢీకొట్టారు. దీంతో బైక్ నుంచి పడిన ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి, కాగా, ఇద్దరు యువతుల్లో ఓ యువతి మృతి చెందింది.
మొదట ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ తర్వాత మరో బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బైక్ను ఢీకొట్టిన పోకిరీలు కొంత దూరం వరకు వెళ్లి కారును పార్క్ చేసి పరారయ్యారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు నిందితుల ఉపయోగించిన కారును గుర్తించారు.
బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితులు వడ్లపూడి వాసులుగా గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్లపూడికి చెందిన లావణ్య, ఆమె భర్త అప్పలరాజు, ఆమె ఆడపడుచు దివ్య కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో అనకాపల్లికి చెందిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను ఉదయం నుంచి వేధించడం ప్రారంభించారు. దీంతో హేమకుమార్, అతని స్నేహితులను లావణ్య భర్త అప్పలరాజు సున్నితంగా మందలించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు వారిని వెంబడిస్తూ మరింతగా వేధింపులకు గురిచేశారు.
అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్పై ఇంటికి వస్తున్న లావణ్య దంపతులను కారులో వెనుక నుంచి వెంబడిస్తూ వేధింపులకు గురిచేశారు. కాగా, లావణ్య దంపతులు సాలాపువానిపాలెం దాటుతున్న సమయంలో హేమకుమార్, అతని స్నేహితులు వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి లావణ్య మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. కారును పరవాడ వద్ద వదిలి పారిపోయారన్నారు.
హేమకుమార్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారని, వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండటాన్ని గమనిస్తే వారు కావాలనే లావణ్యను కారుతో ఢీకొట్టి హత్య చేశారని స్పష్టమవుతోందన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని లావణ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.