ఆ ఎన్నారైకి మాళవిక రూ.11.5 లక్షలు టోకరా, మరికొందరు కూడా
హైదరాబాద్: ఓ ఎన్నారైని పెళ్లి కాని డాక్టర్ను అంటూ మాళవిక అనే యువతి మోసగించిన విషయం తెలిసిందే. ఆమె ఆ ప్రవాస భారతీయుడి నుండి రూ.11.5 లక్షలు తీసుకుంది. మాళవిక భర్త ఓ వ్యాపారవేత్త. అయితే, కొద్ది రోజులకు వారి వ్యాపారం దివాళా తీసింది. దీంతో మాళవిక డబ్బు సంపాదించేందుకు మ్యాట్రిమొనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో డాక్టర్ అవతారం ఎత్తింది.
చాటింగులు చేస్తూ పలువురిని మోసం చేసి లక్షలు తీసుకుంది. బండారం బయటపడేసరికి పురుగుల మందు తాగి పోలీసు స్టేషన్కు వెళ్లింది. మాళవిక డాక్టర్ గీతాంజలి దీపిక, వైదేహీ పేర్లతో ఓ ప్రముఖ మ్యాట్రిమొనీలో నకిలీ ప్రొపైల్ సృష్టించింది. సికింద్రాబాదులోని ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు నిర్వహిస్తున్నానని తెలిపింది. ఆ ప్రొఫైల్ చూసిన అమెరికాలో ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు ఆమెను పరిచయం చేసుకున్నాడు.
ఈ మాటలతో మమాళవిక మాయలో పడిపోయాడు. పలు దఫాలుగా రూ.11.5 లక్షలు వేశాడు. గత ఏడాది జూన్లో అతను ఆమె ఫోటోలు చూశాడు. పెళ్లి చేసుకునేందుకు తనకు ఇష్టమేనని మెయిల్ చేశాడు. ఆమె అతని ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం ప్రారంభించింది. తనకు అత్యవసరంగా డబ్బు కావాలని కోరింది. ప్రశాంత్ ఆ మొత్తాన్ని వేశాడు. దసరా కోసం అతను హైదరాబాద్ వచ్చాడు.
కలుద్దామని చెప్పాడు. తాను హైదరాబాదులో లేనని, తర్వాత కలుద్దామని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన ప్రశాంత్ ఆసుపత్రికి వెళ్లి అడగ్గా ఆ పేరుతో ఎవరు లేరని తెలిసింది. దీంతో మోసపోయానని గుర్తించిన ప్రశాంత్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను పిలిపించారు. తాను ప్రశాంత్కు 11.5 లక్షలు తిరిగి ఇస్తానని నవంబర్ 25న ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఉంటున్న ప్రాంతం నుండి మకాం ఎత్తేసింది.
పోలీసులు అప్పటి నుండి ఆమె పైన నిఘా వేశారు. ఆమె భర్త కూకట్ పల్లి సమీపంలో పోలీసులకు కనిపించాడు. పోలీసులు అతడిని విచారించారు. ఈ క్రమంలో ఆమె సాయంత్రం ఐడు గంటలకు సైబర్ విభాగానికి వచ్చింది. ఏసీబీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. మాళవిక మాయలో ముగ్గురు యువకులు పడినట్లుగా సమాచారం.