గుంటూరు మిర్చి యార్డులో ప్రతి నెల మొదటి, నాలుగో బుధవారం ఉచిత హెల్త్ చెకప్
గుంటూరు: నగరంలోని చిల్లీ యార్డులో వెయ్యి మందికి పైగా పని చేస్తున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద చిల్లీ మార్కెట్. ఇక్కడ ప్రతి నెల మొదటి, నాలుగో బుధవారం ఉచిత హెల్త్ చెకప్లు అందుబాటులోకి వస్తున్నాయి. కాటూరీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇక ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు.
బుధవారం నాడు కాటూరీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటూరీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్ డైరెక్టర్ స్వీరారావు మాట్లాడుతూ... అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో హెల్త్ చెకప్స్ ఉంటాయని చెప్పారు. చిల్లీ మార్కెట్లో పని చేసే వారికి ఉచిత కన్సల్టేషన్, చెకప్ ఉంటుందని తెలిపారు.
ఈ గుంటూరు నగరానికి ఇంత పేరు తీసుకు వచ్చిన (మిర్చి మార్కెట్ ద్వారా గుంటూరుకు ఎంతో పేరు వచ్చింది) ఇక్కడి వారికి ఇది మా సహకారమని తెలిపారు. కాగా, బుధవారం నాడు కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ తదితర 15 వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఈ ఉచిత హెల్త్ క్యాంప్లో పాల్గొన్నారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్ను కాటూరీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు కూడా ఉన్నారు.
గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద చిల్లీ యార్డుగా పేరుగాంచింది. ఇక్కడ పండిన మిర్చీ ఆసియా, కెనడా, యూఎస్ఏ, లాటిన్ అమెరికా, యూరోప్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్రాంతంలో పదిరకాల మిర్చి పంటలు పండుతాయి. గుంటూరు మిర్చి నగరానికి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకు వచ్చింది.