ఏపీలో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ .. కానీ ప్రస్తుతానికి వారికి మాత్రమే !!
కరోనావైరస్ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు కారణమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్ధులందరూ ఆన్లైన్ ద్వారానే విద్యనభ్యసిస్తున్న కారణంగా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన భారతదేశంలో కరోనా కాలం టెక్నాలజీని మరింత పరుగులు పెట్టిస్తోంది. ఒకపక్క విద్యార్థుల చదువు డిస్ట్రబ్ కాకుండా, మరోపక్క కరోనావ్యాప్తిని అరికట్టేలా ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో పేదల ప్లాట్ల పంచాయితీ .. టీడీపీ ఆరోపణలు .. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మంత్రి బుగ్గన
నిరుపేద విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల కోసం ఉచిత స్మార్ట్ ఫోన్లు
ఈ క్రమంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో కరోనా వ్యాప్తి నేపధ్యంలో సాంఘిక సంక్షేమ గురుకులాలలో చదువుతున్న విద్యార్థుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
5 వేల నుంచి ఆరువేల రూపాయలు విలువచేసే స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం
గురుకుల విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించింది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలకమండలి. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థులకు 5 వేల నుంచి ఆరువేల రూపాయలు విలువచేసే స్మార్ట్ ఫోన్లను అందించనున్నారు.ఈ సొసైటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులలో ఇప్పటి వరకు 30 నుండి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాఅందుకే మిగతా విద్యార్థులకు కూడా స్మార్ట్ ఫోన్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ పాఠాలకు అనుకూలంగా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు .
స్వచ్చ గురుకులాలకు ప్రోత్సాహకాలు
ఇక అంతే కాదు గురుకులాలను స్వచ్ఛ గురుకులాలుగా తీర్చిదిద్దుతున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పచ్చదనం పరిశుభ్రత మెయింటెన్ చేస్తున్న గురుకులాలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధమ బహుమతి గా 50 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి గా 30 వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.
సక్సెస్ అయితే మరిన్ని ప్రయోగాలతో ఏపీ విద్యా శాఖ
ఇక విశాఖపట్నంలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈ సమావేశంలో చర్చించారు .ఏదేమైనప్పటికీ కరోనా కష్ట కాలంలోనూ విద్యార్థుల చదువు ఆగకుండా వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి మరీ విద్యాబోధన చేయాలనుకోవడం విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూస్. ఇది సక్సెస్ అయితే భవిష్యత్ లో మరింత విద్యా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టే ఛాన్స్ ఉంది.