విజయవాడ, రాజమండ్రి విద్యార్థులకు పాజిటివ్: థర్మల్ స్క్రీనింగ్ను తప్పించుకోవడానికి చావు తెలివితేటలు.
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఒకేరోజు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరింది. వేర్వేరు దేశాల నుంచి స్వస్థలానికి వచ్చిన ఇద్దరు విద్యార్థుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఆ ఇద్దరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన ఆ ఇద్దరి కుటుంబ సభ్యులను కూడా ఐసొలేషన్ వార్డుల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. స్వస్థలాలకు చేరుకున్న కొన్ని గంటల వ్యవధిలో వారిద్దరిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.
ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!
ప్యారిస్ నుంచి విజయవాడకు..
ప్యారిస్ నుంచి విజయవాడకు వచ్చిన విద్యార్థికి తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. అతని రక్తనమూనాలను సేకరించి విజయవాడలోనే కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో అతణ్ని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. విజయవాడకు చేరుకోవడానికి పారిస్ నుంచి బయలుదేరిన ఆ విద్యార్థి దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. విమానంలోనే విజయవాడకు వచ్చాడు.
నాలుగు విమానాశ్రయాలు దాటుకున్నా..
ఆ విద్యార్థి ఏకంగా నాలుగు విమానాశ్రయాలు దాటుకున్నప్పటికీ.. అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్యారిస్, న్యూఢిల్లీ, శంషాబాద్, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యాధునికమైన థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు ఉన్నాయని, అయినప్పటికి వాటన్నింటినీ ఎలా బయటపడి ఉంటాడనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
లండన్ నుంచి శంషాబాద్ మీదుగా రాజమండ్రికి..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో విద్యార్థిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. లండన్లో చదువుకుంటోన్న ఆ విద్యార్థి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా రాజమహేంద్రవరానికి చేరుకున్నాడు. స్వస్థలానికి చేరుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ మహమ్మారి బారిన పడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒకేరోజు రెండు కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. వైరస్ను నిరోధించడానికి కఠిన చర్యలను చేపట్టింది.
ఐసొలేషన్ వార్డుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ..
విదేశాల నుంచి వచ్చిన వారందరూ నేరుగా ఐసొలేషన్ వార్డుల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ.. వారు ఎలా బయటికి రాగలిగారనే సందేహాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలను వాడి ఉండొచ్చని, ఫలితంగా- వారికి నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్లో జ్వరం లక్షణాలు కనిపించి ఉండకపోవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.