బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన - తెలంగాణపైనా ప్రభావం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న తెలుగు రాష్ట్రాకు మరో బ్యాడ్ న్యూస్. వరుస వాయుగుండాలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజులు ఇబ్బందుల తప్పేలా లేవు. బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడిందని, దీంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని, తెలంగాణపైనా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ, ఏపీ విపత్తు నిర్వహణ శాఖలు తాజాగా హెచ్చరించాయి..
Recommended Video
అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?
5.8 కి.మీ ఎత్తులో..
తెలుగు రాష్ట్రాలకు మరింత ఇబ్బంది పరిణమించేలా.. మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సోమ, మంగళవారం నాటికి అది మరింత బలపడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచే ఒక మోస్తారు వర్షాలు ప్రారంభమై, సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
10 జిల్లాల్లో అప్రమత్తత..
అల్పపీడం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో రాగల 4 రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. మొత్తం 10 జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఆదివారం నుంచే వానలు మళ్లీ కురుస్తాయని, బుధవారం నాటికి తీవ్రత పెరుగుతుందని చెప్పింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ మంగళ, బుధవారాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలవాళ్లు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయా శాఖలు పేర్కొన్నాయి.
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..
జలదిగ్బంధంలో లంక గ్రామాలు
గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరప్రాంతంలోని సుమారు 14 లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మూడు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న వరద లంక గ్రామాలను ముంచెత్తింది. కృష్ణా నదికి వరదపోటెత్తడంతో లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, కరోనా భయంతో కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు విముఖత ప్రదర్శించారు.
ప్రాజెక్టులకు భారీగా వరద..
తెలంగాణలో కురుస్తోన్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టు స్పిల్వే నుంచి 4,65,432 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 28,952, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. దీంతో పది గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,67,860 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో వరద తగ్గడంతో తుంగభద్ర 33 గేట్లను అధికారులు మూసివేశారు.