ఫేస్ బుక్ చేసిన పెళ్లి...రెండేళ్లు ఆన్ లైన్ లవ్:ఒక్కటైన కశింకోట అబ్బాయి...అండమాన్ అమ్మాయి
విశాఖపట్టణం:అనుకోకుండా ఫేస్బుక్లో పరిచయం అయ్యారు...ఆ తరువాత ఫొటోలు చూసుకుని ఒకరినొకరు ఇష్టపడ్డారు...ఆ ఇష్టం ప్రేమగా మారింది. అలా రెండేళ్ల పాటు ఆన్లైన్ లోనే ప్రేమించుకున్నారు. ఆ క్రమంలోనే ఇరువురి పెద్దలను ఒప్పించారు...ఫైనల్ గా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
ఇదీ బుధవారం బుధవారం కశింకోటలో జరిగిన ఒక వివాహ వేడుక వెనుక ఆసక్తికర నేపథ్యం. ఫేస్ బుక్ ప్రేమలు గురించి వినడమే కాని ఎన్నడూ ప్రత్యక్షంగా చూడని అక్కడి స్థానికులు ఈ పెళ్లి గురించి వింతగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు వివాహం అంటే పెళ్లిచూపులు తో మొదలై అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల ఆరాలు... నిశ్చితార్థం...సమావర్తనం ఇలా ఎన్నో తంతులుండేవని...ఇప్పుడు ఇలాంటి పెళ్లిళ్లు కూడా చూస్తున్నామని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే...
కశింకోటకు చెందిన న్యాయపతి శివరామ్ (28) హైదరాబాద్లోని వెరిజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సౌత్ అండమాన్ పోర్టుబ్లేయర్లో చిన్నప్పట్నుంచే స్థిరపడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.సుశీల (24) అనే యువతితో ఫేస్బుక్లో స్నేహం ఏర్పడింది. అనుకోకుండా ఫేస్ బుక్ లో ఒకరి ఫోటోలు ఒకరు చూడటం తటస్థించిన వీరు ముందు స్నేహితులు గా...అనంతరం ప్రేమికులుగా మారారు.
అలా రెండేళ్ల పాటు వీరు ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోకుండానే...నేరుగా చూసుకోకుండానే ఆన్ లైన్ లోనే ప్రేమించుకున్నారు. ఆ క్రమంలో తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. అలా వీరిద్దరి ప్రేమకు ఇరువురి పెద్దలు అంగీకారం తెలియజేయడంతో...ఇక వీరి ఫేస్ లవ్ పెళ్లి పుస్తకంగా మారడానికి లైన్ క్లియర్ అయింది.
దీంతో సాంప్రదాయం ప్రకారం ఈ నెల 17న అండమాన్లో శివరామ్, సుశీలకు వివాహం జరిగింది. అక్కడ వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఆ తరువాత అక్కడనుంచి బుధవారం కశింకోటలోని వరుడు ఇంటికి చేరుకుంది. ఇక్కడ కూడా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో కోదండ సీతారామాలయంలో బుధవారం వివాహ వేడుక నిర్వహించారు.
ఈ పెళ్లి వేడుకలకు హాజరైన వారు వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కడవడం వెనుక నేపథ్యం తెలుసుకొని ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో చూసుకొని ఆన్ లైన్ లోనే ప్రేమించుకొని ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చిన వీరిద్దరూ అసాధ్యులంటూ అదో వింతగా చెప్పుకుంటున్నారు. తమ మనస్సులు కలవడంతో ఇద్దరం పెళ్లి చేసుకొని ఒక్కటయ్యామని నవదంపతులు శివరామ్, సుశీలలు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.