ఇంకా డైలమానే: జగన్ అక్కడ కాదంటే.. మరోసారి ఆనం భేటీ?
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. వారి మధ్య ఏం చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.
జగన్తో భేటీ ఎఫెక్ట్.. ఆనం వర్గంపై టీడీపీ వేటు: వైసీపీలోకి వెళ్లడం లేదా?
మరోసారి జగన్తో భేటీ
జగన్తో ఆనం మరోసారి భేటీ కానున్నారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీ అధినేతను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీలో చేరిక విషయం పక్కన పెడితే ఆయన ఎక్కడి నుంచి పక్కన పెడతారనే చర్చ కూడా సాగుతోంది.
మరోసారి అందుకే భేటీ
ఇటీవల విమానాశ్రయంలో జగన్, ఆనంలు కాసేపు మాట్లాడుకున్నారు. సమయాభావం వల్ల పూర్తిగా మాట్లాడుకునే అవకాశం రాలేదని అంటున్నారు. ఇప్పుడు జగన్తో మరోసారి భేటీ అయి, తన పోటీపై జగన్ నుంచి పూర్తి స్పష్టత తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
ఆత్మకూరు నుంచి పోటీ.. డౌట్!
ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆత్మకూరు నుంచేనని ఇటీవల ఆనం తన అనుచరులతో చెబుతున్నారట. వైసీపీలోకి వచ్చి ఆత్మకూరు నుంచి అంటే జగన్ అంగీకరించకపోవచ్చునని అంటున్నారు. ఎందుకంటే అది మేకపాటి కుటుంబానిది.
జగన్ ఆత్మకూరు కాదంటే
ఈ క్రమంలో వైసీపీలోకి వస్తే ఆత్మకూరు నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ ఇప్పటికే అందుకు సంబంధించి ఆనంకు సంకేతాలు పంపారని, ఆయన కూడా అంగీకరించారని అంటున్నారు. ఆత్మకూరు కాకుంటే వెంకటగిరి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఆనం పోటీపై ఈ భేటీలో తేలిపోనుందని అంటున్నారు.