త్వరగా నిర్ణయించండి!: ఢిల్లీలో తీరిక లేకుండా బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు బాధ్యత కేంద్ర హోంశాఖదేనని, అందుకే హామీల అమలుకు ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం అమల్లో ఎదురవుతున్న సమస్యలను ఆయనకు వివరించానని, చట్టంలో పేర్కొన్న అంశాలన్నిటినీ అమలు చేయాలని కోరానని తెలిపారు. ప్రత్యేక హోదాపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
హుధుద్ తుపాను నష్టంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపించాలని కోరినట్లు చెప్పారు. అలాగే, అంచనాలు అందుకున్న తర్వాత నిధులు త్వరగా విడుదల చేయాలని కోరానన్నారు. హుధుద్ తుపానుకు ప్రధాని రూ.వెయ్యి కోట్లు తక్షణ సహాయం ప్రకటించారని, వాటిలో రూ.400 కోట్లు విడుదలయ్యాయన్నారు. మిగతా నిధులతోపాటు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరానన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రంలో కదలిక ఉందని, మరిన్ని హామీలను అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయాలై కేంద్రంతో మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకోవడంపైనే తాను దృష్టి సారించానని తెలిపారు. శుక్రవారం చంద్రబాబు ఢిల్లీలో తీరిక లేకుండా గడిపారు.
ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులు, నేతలతో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు జల మంథన్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం, పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు.
ఉదయం కేంద్ర జలవనరుల శాఖ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నానని, జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి కొంత సమయం తీసుకుంటుందని, కాబట్టి తొలుత ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానానికి సహకరించాలని కోరానని చంద్రబాబు విలేకరులతో చెప్పారు.
అనంతరం ఉమాభారతితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలని కోరారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపైనా చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య తక్కువగా ఉందని, మరిన్ని అభివృద్ధి చేయాలని నితిన్ గడ్కరీని కోరారు.
డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ బ్యాండ్ విడ్త్ విస్తరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిసి వివరిచారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు నిధులను కేంద్రం తమకు ఇవ్వాలని, పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఇంటర్నెట్ అనుసంధానాన్ని పెంచుతామని ఐటీ మంత్రికి చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు.
ఐదారుగురు మంత్రులను కలిశానని, ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలంటే రైల్వేలు, రోడ్లు, విమానాలు, పోర్టులు తదితరాలను అనుసంధానం చేయాలని కోరానన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ భవన్కు వచ్చి చంద్రబాబును కలిశారు. విశాఖపట్నంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణంపై ఆమెతో చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు.
పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఏపీ భవన్ వచ్చి చంద్రబాబును కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఆయన నివాసంలోనే చంద్రబాబు కలిశారు. ఆయనతో గంటకుపైగా చర్చలు జరిపారు. వీరి భేటీ మర్యాదపూర్వకమేనని చెప్పారు.