ఆ ఒక్కటీ అడక్కు: నిన్న చెప్పారు..నేడు జీవో జారీ: ఉద్యోగులకు పూర్తి వేతనాలకు గ్రీన్ సిగ్నల్
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలను చెల్లించస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన 24 గంటలు కూడా కాలేదు. ఈలోగా దీనికి సంబంధించిన జీవో విడుదలైంది. అన్ని స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల నుంచి పూర్తి వేతనాన్ని చెల్లించడానికి అవసరమైన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ అనుమతి లభించిన వెంటనే- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు.
ఏపీలో కరోనా కేసులకు బ్రేకుల్లేవ్: మరణాలూ పెరిగాయ్: జనజీవనం కుదురుకుంటోన్న వేళ..
ఖజానా ఖాళీ ఎఫెక్ట్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఈ రెండు నెలల లాక్డౌన్ సమయంలో కొన్ని కీలక సంక్షేమ పథకాలను అమలు చేసింది. వాటికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. లాక్డౌన్ వల్ల అటు రాబడి లేక.. ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఖజానా ఖాళీ అయింది.
అన్ని స్థాయిల్లో కోత..
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టింది జగన్ సర్కార్. మార్చి నెలలో సగం-సగం వేతనాన్ని చెల్లించింది. ఏప్రిల్లో వేతనాల్లో కోత పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిని బట్టి వారి జీతంలో కోత విధించింది. ఐఎఎస్ అధికారుల జీతంలో 60 శాతానికి కత్తెర పెట్టింది. వారికి 40 శాతం జీతమే చెల్లించింది. మేనెలలోనూ అదే పరిస్థితి తలెత్తవచ్చనే ఉద్దేశంతో అటు ఐఎఎస్ అధికారులు, ఇటు నాన్ గెజిటివ్ అధికారులు, రెవెన్యూ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి పలు విజ్ఙప్తులు చేశారు.
పూర్తి వేతనం చెల్లించడానికి
తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పూర్తి వేతనాన్ని చెల్లించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించారు. మే నెల నుంచి పూర్తి జీతాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగుల జీతాలు, గౌరవ వేతనాల్లో ఎలాంటి కోత విధించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. పూర్తి వేతనాలను చెల్లించడానికి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నీలం సాహ్నీ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
Recommended Video
కుదురుకున్న తరువాతే బకాయిలు
ఇందులో బకాయిల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనేది వెల్లడించలేదు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యాపార లావాదేవీలు, ఆర్థిక కర్యకలాపాలు ప్రారంభమై, ప్రభుత్వానికి కొద్దో, గొప్పో ఆదాయం అందిన తరువాతే ఉద్యోగుల బకాయిలను చెల్లించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికోసం కనీసం మూడు నెలల సమయం తీసుకోవచ్చని అంటున్నారు.