నంద్యాల ఎఫెక్ట్: రూ.100 కోట్లు ఆ 16 మందికి ఇవ్వాలి, మంత్రి 'ఆది' ఆసక్తికరం
నంద్యాలలో అభ్యర్థిని గెలిపించినందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని మంత్రుల మధ్య సరదా సంబాషణఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన 16 మంది ఎమ్మెల్యేలకు ఈ రూ.100 కోట్లు పంచాలి
అమరావతి:నంద్యాల ఉపఎన్నికల్లో విజయంతో ఆ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంతో ఉన్నారు. వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్కిషోర్ కు ఆ పార్టీ రూ.50 కోట్లు చెల్లించనుంది. అయితే నంద్యాలలో టిడిపి అభ్యర్థి విజయం సాధించేందుకు కృషి చేసిన తమకు రూ.100 కోట్లు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు తమకు ఇవ్వాలని వారు సరదాగా అంటున్నారు. ఏపీ సచివాలయంలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకొన్న ఆసక్తికర సంభాషణ ఆసక్తికరంగా ఉంది.
2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకుగాను ఆ పార్టీ ప్రశాంత్కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకొంది. అయితే నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పరాజయం పొందారు.
నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. సుమారు నెలరోజులుగా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు.
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ సూచనలు, సలహలకు అనుగుణంగానే నంద్యాలలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అనుసరించారు. అయితే ఈ వ్యూహం మాత్రం నంద్యాల ఎన్నికల్లో బెడిసికొట్టింది. నంద్యాల ఫలితాలపై మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేల మధ్య పేషీల్లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
రూ.100 కోట్లు బాబును అడగాలి
వైసీపీని గెలిపించేందుకు వచ్చిన ప్రశాంత్కిషోర్కు వైసీసీ రూ.50 కోట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ఒప్పుకొందని ప్రచారం. అయితే నంద్యాలలో టిడిపి అభ్యర్థిని గెలిపించినందుకు తమకు రూ.100 కోట్లు రావాలని టిడిపి నేతలు అంటున్నారు. టిడిపి అభ్యర్థిని నంద్యాలలో గెలిపించినందుకుగాను వందకోట్లు ఇవ్వాలని చంద్రబాబును అడగాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సరదాగా మాట్లాడుకొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పేషీలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ల మధ్య ఈ సంభాషణ చోటుచేసుకొంది.
16మంది ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు సమానంగా పంచాలి
నంద్యాలలో గెలిపించినందుకు.... ఆ గెలుపులో కీలకపాత్ర పోషించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు వంద కోట్లను సమానంగా పంచాలని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన 16 మంది ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లను పంచాలని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పడంతో అందరూ నవ్వారు.
మాకు కూడ పీకే ఉన్నారు
నంద్యాల ఎన్నికల్లో తమ పార్టీలో కూడ పీకే కీలకంగా వ్యవహరించారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. అయితే టిడిపిలో పీకే ఎవరని మంత్రులు ప్రశ్నించారు. అయితే పయ్యావుల కేశవ్ మా పార్టీలో పీకేగా వ్యవహరించారని మంత్రి ఆధినారాయణరెడ్డి చెప్పడంతో మంత్రులంతా నవ్వారు.
గోస్పాడులో చక్రం తిప్పింది వీరే
నంద్యాల నియోజకవర్గంలో గోస్పాడు మండలం గెలుపు ఓటములపై ప్రభావం చూపింది. అయితే ఈ మండలంలో వైసీపీ మెజారిటీ రాకుండా టిడిపి నేతలు కట్టడి చేశారు. ఈ మండలంలో ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆమంచి కృష్ణ మోహన్ ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. గోస్పాడు మండలంలోని గ్రామాలను విభజించి, అక్కడే ఉండి అనుచరులను కూడా తీసుకువెళ్లి ప్రచారం చేశారు. చివరకు గోస్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావటంతో వారంతా ఆనందంతో ఉన్నారు.