కోడెల హయాంలో మరో ఘన కార్యం: ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్ మాయం..సత్తెనపల్లికి తరలింపు..!!
తవ్వుతున్న కొద్దీ మాజీ స్పీక్ కోడెల కుటుంబ సభ్యుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చివరకు అసెంబ్లీకి సంబంధించిన ఆస్తులను సైతం కోడెల కుటుంబీకులు వదల్లేదనే సమాచారం ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలించే సమయంలో చాల వరకు ఫర్నీచర్ సత్తెనపల్లి..నర్సరావుపేటకు తరలించారనేది అభియోగం. ఫర్నీచర్ తో పాటుగా ఏసీలు సైతం తరలి వెళ్లాయి. ఆ సమయంలో స్పీకర్ గా కోడెల ఉండటంతో ఈ విషయం పైన అంతర్గతంగా చర్చ మినహా..అసలు విషయం బయటకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో దీని పైన అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో..విచారణ మొదలైంది. ఏపీ అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ నర్సరావుపేట..సత్తెనపల్లికి వెళ్లిన మాట వాస్తమేననే పోలీసులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఫర్నీచర్ ను వదల్లేదుగా..
కేఎస్టీ పేరుతో సత్తెనపల్లి.. నర్సరావుపేట లో వసళ్ల పర్వం కొనసాగించిన మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు చివరకు అసెంబ్లీ ఆస్తులను వదల్లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివ ప్రసాద్ ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్.. ఏసీలు..ఇతర సామాగ్రిని సైతం అమరావతికి తీసుకొచ్చారు. అయితే, ఆ సమయంలో అక్కడి నుండి బయల్దేరిన ఆ ఫర్నీచర్..ఏపీలు పూర్తి స్థాయిలో అమరావతికి చేరలేదు. నూతన అసెంబ్లీ నిర్మాణ సమయంలోనూ పూర్తి స్థాయి ఫర్నీచర్.. సీలింగ్ ఏసీలు కావటంతో ఇక్కడ వినియోగించాల్సిన అవసరం లేదని కోడెల సంబంధీకులే వారికి వారే నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో.. అక్కడ నుండి తరలించిన కీలక వస్తువులు..రికార్డులు మినహా మిగిలిన ఫర్నీచర్ తో పాటుగా ఏసీలను సైతం సత్తెనపల్లి.. నర్సరావుపేటకు తరలించారని వారి మీద అభియోగం. చాలా రోజులుగా అసెంబ్లీ ప్రాంగణంలో దీని మీద ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో ఏ ఒక్కరూ దీని గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ముందుకు రాలేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఈ వ్యవహారం పోలీసుల కు చేరవేసారు. నేరుగా అసెంబ్లీ కార్యదర్శి బాలక్రిష్ణమాచార్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో...పోలీసులు విచారణ ప్రారంభించారు.
కోడెలకు తెలిసేనా..తెలియకుండానా..
నర్సరావుపేట..సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుటుంబ సభ్యుల వసూళ్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ సొత్తును సైతం ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నియోజకవర్గాలకు తరలించారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పైన విచారణ సాగుతున్నా..చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం మాత్రం అసెంబ్లీ ఫర్నీచర్ ను తరలించారనేది స్పస్టంగా చెబుతున్న విషయం. అయితే, కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఆ రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న దందాలు..వసూళ్ల గురించి ప్రతిపక్షం వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అయినా..కోడెల నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల ఆగడాల కారణంగానే ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలే కోడెల మీద తిరుగుబాటు చేసారు. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. అనేక బుజ్జగింపుల ద్వారా ఎన్నికలు చేయాల్సి వచ్చింది. కోడెలను తప్పించమని నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకే కోడెల వ్యతిరేక వర్గం వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక, ఇప్పుడు అసెంబ్లీ సొత్తును సైతం మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కోడెలకు తెలిసే జరిగిందా..లేక ఆయనకు తెలియకుండా కటుుంబ సభ్యులే ఇలా చేసారా అనేది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.
కేసులు..ఆరోపణలతో విలవిల..
ఎన్నికల సమయంలో రాజకీయంగా మొదలైన సమస్యలు..ఎమ్మెల్యేగా ఓడిపోవటం.. వైసీపీ అధికారంలోకి రావటంతో కోడెల చక్రబంధంలో చిక్కుకున్నారు. ఇప్పటికే అనేక కేసులు కోడెల సంతానం మీద నమోదయ్యాయి. రాజకీయంగా తమ మీద కక్ష్య సాధింపుకు ప్రభుత్వం పాల్పడుతోందని కోడెల ఆరోపిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో సైతం వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. అదే సమయంలో కోడెల కుమారుడికి చెందిన ద్విచక్ర వాహన షోం రూంలలో సైతం నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా వాటిని సీజ్ చేసారు. ఇక, ప్రతీ రోజు కోడెల కుటుంబం మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కేబుల్ వైర్ల ట్రాక్టర్ తో వచ్చి కోడెల నివాసం వద్ద ధర్నా చేసారు. ఇప్పుడు తాజాగా ఏకంగా అసెంబ్లీ సొత్తునే తరలించారనే ఆరోపణలతో కోడెల పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.