వాడు మామూలోడు కాదు.. స్కీమ్ పేరిట స్కామ్.. కోటి రూపాయలకు ఎసరు
తణుకు : స్కీమ్ అన్నాడు.. స్కామ్ చేసి పరారయ్యాడు. ఫర్నీచర్ ఇస్తానన్నాడు.. లక్షలు కొల్లగొట్టి ఐపీ పెట్టాడు. అటు ఏజెంట్లు.. ఇటు పబ్లిక్ సదరు మోసగాడిని నమ్మి నిండా మునిగారు. స్కీమ్లో చేరితే ఫర్నీచర్ ఇస్తానంటూ ఆశ చూపి అందినకాడికి దండుకుని జంపయ్యాడు. డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్.. రొయ్యల పేరుతో కోట్లకు ముంచిన టీచర్ ఫ్యామిలీ
స్కీమ్ అన్నాడు.. స్కామ్ చేశాడు.. తీరా బోర్డు తిప్పేశాడు
తణుకులో శ్రీ ఫర్నీచర్ షోరూమ్ యజమాని కోర్ల శ్రీనివాస్ బోర్డు తిప్పేశాడు. దాదాపు కోటి రూపాయల వరకు దండుకుని పలాయనం చిత్తగించాడు. వేల్పూరు రోడ్డులో ఉన్న సదరు ఫర్నీచర్ షోరూమ్లో స్కీమ్ అంటూ స్కామ్ చేశాడు ఓనర్. ఫర్నీచర్ స్కీమ్ అంటూ మొదలుపెట్టి కొందర్ని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. సభ్యులుగా చేర్పిస్తే కమిషన్ ఇస్తానంటూ ఆశజూపి వారికి కూడా కుచ్చుటోపి పెట్టాడు.
అటు ఏజెంట్లు తెచ్చిన గిరాకీతో పాటు షాపుకు వచ్చే కస్టమర్లను సైతం బోల్తా కొట్టించాడు శ్రీనివాస్. స్కీమ్లో చేరితే ఫర్నీచర్ ఇస్తానంటూ ఆశ చూపాడు. తీరా డబ్బులు కూడగట్టుకుని పరారయ్యాడు. అంతేకాదు పెద్ద ఎత్తున అప్పులు కూడా తీసుకున్నాడట సదరు మోసగాడు.
కోటి దండుకుని ఐపీ నోటీసులు.. భార్యను పట్టుకున్న బాధితులు
కోటి రూపాయలకు పైగా వసూలు చేసుకుని మాయమయ్యాడు శ్రీనివాస్. ఏప్రిల్ నెలలో బోర్డు తిప్పేసి ఊరు విడిచి పరారయ్యాడు. అనంతరం ఐపీ (Insolvancy Petition) పెట్టి లాయర్ ద్వారా బాధితులకు, ఏజెంట్లకు నోటీసులు పంపించాడు. అలా అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శ్రీనివాస్ జాడ కోసం ఎదురుచూస్తున్న బాధితులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అటు పోలీస్ కేసు కూడా ఫైల్ కావడంతో వారు కూడా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, నో యూజ్.
అదలావుంటే ఆయన భార్య ప్రసన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు పయనమయ్యారు. అది గమనించిన కొందరు బాధితులు ఆమెను ఫాలో అయ్యారు. తేతలి వై జంక్షన్ దగ్గర బస్సేక్కే క్రమంలో అడ్డుకున్నారు. దాంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. చేసేదేమీ లేక ప్రసన్నను తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆమెను పీఎస్కు తరలించారనే సమాచారంతో మరికొంతమంది బాధితులు, ఏజెంట్లు అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
డబ్బులు తిరిగి ఇవ్వండి.. ఏజెంట్లకు తప్పని బాధలు
అప్పుసప్పు జేసి స్కీమ్లో చేరామని.. తమ డబ్బులు తీసుకుని పరారయ్యాడని కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పురుగుల మందు, పెట్రోల్ వెంట తెచ్చుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. సదరు మోసగాడి భార్య ప్రసన్న ద్వారా శ్రీనివాస్ను రప్పించి తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. దాంతో త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
ఫర్నీచర్ స్కీమ్ అంటూ శ్రీనివాస్ తమకు ఎంతో ఆశ చూపించాడని ఏజెంట్లు వాపోతున్నారు. 12 లక్షల రూపాయలు శ్రీనివాస్కు ఇచ్చానని.. ఇప్పుడేమో బాధితులు తనను ఇవ్వాల్సిందిగా వత్తిడి తెస్తున్నారని ఓ ఏజెంట్ కన్నీటిపర్యంతమయ్యాడు. మరో మహిళా ఏజెంట్ బాధ వర్ణనాతీతం. దాదాపు 4 లక్షల రూపాయలు చెల్లించానని.. తనతో పాటు చాలామందిని స్కీమ్లో చేర్పించానని.. షోరూమ్ యజమాని పరారీ కావడంతో సదరు మహిళలంతా తన వెంట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కట్టిన డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.