విశాఖ:ఎసిబి వలలో మరో తహసీల్దార్...రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
విశాఖపట్టణం: రెవిన్యూ శాఖకు చెందిన మరో అవినీతి చేప ఎసిబి వలకు చిక్కింది. ఇక మైనింగ్ క్వారీకి సంబంధించి ఎన్వోసీ ఇచ్చేందుకు జీ.కే.వీది తహశీల్థార్ చిరంజీవి పడాల్ సంబంధిత క్వారీ యజమాని నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మైనింగ్ క్వారికి ఎన్.ఒ.సి ఇచ్చేందుకు ఎమ్మార్వో 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ క్వారీ యజమాని రామకృష్ణరాజు బేరం ఆడి రూ. 10 లక్షలకు వేలకు బేరం కుదుర్చుకున్నాడు. తొలి దఫాగా 50 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరాంది. ఆ తరువాత రామకృష్ణరాజు ఈ విషయం ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత రూ.50 వేలు ఎమ్మార్వోకు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాదు తెలిపిన వివరాలు ప్రకారం...ఎసికొయ్యూరు మండలం డౌనూరు మాజీ సర్పంచి రామకృష్ణరాజు ఏబులంలో తారుప్లాంటుకు అవసరమైన నల్లరాయి క్వారీ పేలుళ్లకు అనుమతుల కోసం అనకాపల్లి గనుల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) గూడెం కొత్తవీధి(జీ.కే.వీది) తహసిల్దారు ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఈ నెల 19న తహసిల్దారు చిరంజీవి పడాల్ను కలిసి రామకృష్ణరాజు ఎన్వోసీ ఇవ్వాలని కోరారు. ఈ అనుమతి కోసం ఆయన రూ. 15 లక్షలు డిమాండు చేశారు. చివరికి రూ. 10 లక్షలకు బేరం కుదిరింది.
తొలి విడతగా బుధవారం రూ.లక్ష ఇవ్వమని తహసీల్దార్ డిమాండు చేశారు. రామకృష్ణరాజు రూ.50 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం రామకృష్ణరాజు ఎసిబికి సమాచారం ఇచ్చారు. దీంతో ఎసిబి అధికారులు గూడెం కొత్తవీధి చేరుకుని రసాయనాలు పూసిన నోట్లను రామకృష్ణరాజు ఇచ్చి తహసిల్దారు కార్యాలయానికి పంపించారు. అనుకున్నవిధంగా రామకృష్ణరాజు రూ. 50 వేలు తహశీల్దారుకు ఇచ్చేందుకు ప్రయత్నించగా, తన ప్రైవేటు కారు డ్రైవర్ పూజారి గణేష్కు ఇవ్వమని తహసిల్దారు సూచించారు.
బయట ఉన్న కారు డ్రైవర్కు రామకృష్ణరాజు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. తహసిల్దారు తీసుకోమంటేనే డబ్బులు తీసుకున్నానని కారుడ్రైవర్ చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు తహశీల్దారును, డ్రైవర్ను అరెస్టుచేశారు. తహసిల్దారును, డ్రైవర్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాదు తెలిపారు.