కాకా అంత్యక్రియలు పూర్తి... హాజరైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ కురు వృద్దుడు, సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి పెద్దకుమారుడు వినోద్ నిప్పు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. బేగం పేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డి ఉన్నారు. అంతక ముందు కాకా మృతదేహానికి మంత్రులు హరీష్రావు, తుమ్మల, ఇంద్రకరణ్, జోగురామన్న, కాంగ్రెస్ నేతలు జైపాల్రెడ్డి, జానారెడ్డి, డీఎస్, గీతారెడ్డి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఏడున్నర నెలలక్రితం తన ఫామ్హౌస్లో కాలు జారిపడిన కాకా, అప్పటినుంచి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
కిడ్నీ సంబంధిత వ్యాధికూడా సోకడంతో 92 ఏండ్ల కాకా ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమించింది. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తుండగానే సోమవారం రాత్రి 8.45 గంటలకు మరణించిన విషయం తెలిసిందే.