టిడిపి వైపు గాదె చూపు: జగన్ చిట్టా ఉందని యనమల
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి కూడా సైకిలెక్కే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే కాంగ్రెసు నుండి పెద్ద సంఖ్యలో టిడిపిలో చేరుతున్నారు. విశాఖ నుండి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఆయన ఈ నెల 12న విశాఖలో జరగనున్న ప్రజాగర్జనలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, కన్నబాబు రాజు, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు చేరనున్నారు.
గాదే మాట్లాడుతూ... రాజకీయాలు అయినా మానుకుంటాని కానీ కాంగ్రెసులో మాత్రం కొనసాగనని చెప్పారు. ఆయన బాపట్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సముచిత స్థానం కల్పించే పార్టీలో చేరుతానని తెలిపారు. తెలుగుదేశం, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలలో దేనిలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి శనివారం చంద్రబాబును కలిశారు. పాణ్యం టిక్కెట్ కోరుతున్నారు. అయితే ఇప్పటికే టిడిపిలో చేరిన ఏరాసు ప్రతాప్ రెడ్డి అదే సీటు కోరుతున్నారు. ఇప్పటికే ఏరాసు, టిజి వెంకటేష్లు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా చేరనున్నారు.
జగన్ చిట్టా ఉంది: యనమల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని తెలుగు దేశం మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విజయవాడలో అన్నారు. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సీమాం«ధ్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికలలో జగన్ పార్టీ 20 మించి అసెంబ్లీ స్ధానాల్లో గెలవలేదన్నారు.
పొత్తులపై తమ్మినేని
వారంలో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని సిపిఎం నేత తమ్మినేని సీతారం అన్నారు. కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకించే పార్టీగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని చూస్తున్నట్లు చెప్పారు.