విభజనపై కలత: ఏడ్చేసిన ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి
గుంటూరు: రాష్ట్ర విభజనపై గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపించారు. మీడియా ప్రతినిధుల ముందు ఆయన కంటి తడి పెట్టుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఏ రోజూ అనుకోలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
శాసనసభ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా అదే బిల్లును పార్లమెంటులో పెట్టుకుని ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇది అప్రజాస్వామిక నిర్ణయమని ఆయన అన్నారు. ఈ విధమైన నిర్ణయాలు అమలు చేసేవారు ఎంతటివారైనా కష్టాలు కొని తెచ్చుకుంటారని ఆయన అన్నారు.
రాజ్యాంగాన్ని సవరిస్తే గానీ శాసనసభ వ్యతిరేకించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలు లేదని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచడాన్ని రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. తెలంగాణ కావాలని కోరుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.
రాష్ట్ర విభజన వ్యవహారంపై నివేదికలన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే సూచించాయని ఆయన అన్నారు. వాటిని తుంగలో తొక్కిన కాంగ్రెసు పార్టీ విభజన వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం భావ్యం కాదని ఆయన అన్నారు.