'ఆ ధైర్యం టీడీపీకి ఉందా?': పెద్ద తలకాయల పేరుతో!, వైసీపీలో కలవరం.. ఎప్పుడు ఏ వికెట్ పడుతుందో..
విజయవాడ: జగన్ పాదయాత్రవేళ పార్టీ ఫిరాయింపుల గోల వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా?.. లేక నిజంగానే తమ నేతలు ఆ పార్టీతో టచ్లో ఉన్నారా? అన్నది తేల్చుకోలేక సతమతమవుతోంది.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు నేపథ్యంలో మరిన్ని వలసలు తప్పవని టీడీపీ నుంచి సంకేతాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శిబిరంలో కలవరం మొదలైంది. వైసీపీలో ఓ పెద్ద తలకాయను లాగుతున్నామని ఇటీవల అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ ఆ కలవరాన్ని మరింత పెంచాయి.
ఎప్పుడు ఏ వికెట్ పడుతుందో?
గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడంతో ఇప్పటివరకు పార్టీని వీడినవారి సంఖ్య 23కి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 44మంది ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు జంప్ అవుతాడో అన్న తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలోని కొంతమంది నేతలు నిరంతరం అదే పనిలో మునిగి తేలుతుండటంతో ఎప్పుడు ఏ వికెట్ పడుతుందోనన్న ఉత్కంఠ వైసీపీలో కొనసాగుతోంది.
నిజంగా టచ్ లో ఉన్నారా?:
వైసీపీలో చాలామంది నేతలు తమతో టచ్లో ఉన్నారని టీడీపీ చెప్పుకుంటోంది. జగన్ నాయకత్వ లోపాలను భరించలేకే వారంతా తమతో టచ్ లోకి వస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ తరహా ప్రచారం ద్వారా జగన్ పొలిటికల్ మైలేజ్ ను దెబ్బతీయాలనే వ్యూహం టీడీపీ అమలు చేస్తోందన్న వాదన లేకపోలేదు. అదే సమయంలో చాలామంది వైసీపీ నేతలు భవిష్యత్తుపై డైలామాలో ఊగిసలాడుతున్నట్లు కూడా తెలుస్తోంది.
అదే అదునుగా:
డైలామాలో ఉన్న వైసీపీ నేతలను లాగే క్రమంలో పెద్ద తలకాయల పేర్లను టీడీపీ తెర పైకి తెస్తోంది. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా తెర పైకి వచ్చింది. టీడీపీపై ఎప్పుడూ విరుచుకుపడే శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం ద్వారా మరింత మంది వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తారనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. అలా పెద్ద తలకాయల పేర్లు అడ్డుపెట్టుకుని వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగాలని టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నేను జగన్ వెంటే: శ్రీకాంత్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తనతో సంప్రదించినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, అదే మాటను తన ముందుకు వచ్చి చెప్పే ధైర్యం వాళ్లకు ఉందా? అంటూ సవాల్ విసిరారు.
అవాస్తవాలను ప్రచారం చేయడం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. ప్రతీసారి పార్టీ మార్పుపై వివరణ ఇచ్చుకోవడం తనకే సిగ్గనిపిస్తోందని అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే నడుస్తానని... నీతి మాలిన రాజకీయాలను తాను చేయలేనని తేల్చి చెప్పారు.
నీతిమాలిన రాజకీయాలు చేయలేను:
నీతి మాలిన రాజకీయాలు చేయలేనని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను తయారుచేస్తానని చెప్పిన గొప్ప నాయకుడు జగన్ అని ప్రశంసించారు. జగన్ పాదయాత్రను చూసి అటు కాంగ్రెస్ కూడా ఓర్వలేకపోతోందన్నారు. పాదయాత్రకు జనం మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తనతో సంప్రదించినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, అదే మాటను తన ముందుకు వచ్చి చెప్పే ధైర్యం వాళ్లకు ఉందా? అంటూ సవాల్ విసిరారు.