ఇంకెందుకు.. మీరొక్కరు సరిపోదు, వాళ్లూ చేయాలి: గడ్కరీకి మురళీ మోహన్ ఝలక్!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను వరుసగా నెరవేరుస్తోందని, ఇలాంటప్పుడు మీరు ఆందోళన చేయడం ఎందుకు అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలుగుదేశం పార్టీ ఎంపీలను మంగళవారం ప్రశ్నించారు.
చదవండి: చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
ఏపీ ఎంపీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం లోకసభ వాయిదా పడిన అనంతరం మొదటి వరుసలో కూర్చున్న గడ్కరీ ఎంపీలను అడిగారు.
చదవండి: మోడీకి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తారా?
టీడీపీ ఎంపీలకు గడ్కరీ ప్రశ్న
ఏపీకి న్యాయం చేయాలని, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు లోకసభ, రాజ్యసభల్లో నిత్యం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా వారు స్పీకర్ ఎదుటకు వచ్చి నిరసన తలిపారు. దీంతో అక్కడే ఉన్న గడ్కరీ స్పందించారు.
మురళీ మోహన్ సహా వారిని పిలిచి అడిగిన గడ్కరీ
ఏపీ అడిగిన విధంగా పోలవరం, రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నా ఎందుకు ఆందోళన చేస్తున్నారని గడ్కరీ టీడీపీ సభ్యులను అడిగారు. ఆ సమయంలో మురళీ మోహన్, అవంతి శ్రీనివాస్, గల్లా జయదేవ్, రవీంద్ర బాబులు ఆందోళన చేస్తున్నారు. వారిని పిలిచి అడిగారు.
మీరొక్కరు చేస్తే సరిపోదు, మీలాగే మిగతావాళ్లు చేయాలి
పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, అత్యధిక జాతీయ రహదారులు ఇచ్చామని, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆరా తీశారు. అందుకు టీడీపీ సభ్యులు సమాధానం ఇచ్చారు. మీరొక్కరు (కేంద్రమంత్రిగా గడ్కరీ ఇచ్చిన వాటిని ఉద్దేశించి) చేస్తే సరిపోదని, విభజన సమస్యల పరిష్కారంలో మిగతా మంత్రులు మీలాగే చొరవ చూపాలన్నదే తమ అన్నారు.
హోదా ఇప్పుడు సెంటిమెంట్, ప్రజలు నమ్మరు
ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఏపీలో సెంటిమెంటుగా మారిందని ఎంపీలు గడ్కరీకి చెప్పారు. అది ఇవ్వకుండా ఏమిచ్చామని, చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దానిపై గడ్కరీ మాట్లాడుతూ... అందుకు ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. దీనిపై టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ఇప్పటికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, సీఎం చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వచ్చి ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఆర్థిక బిల్లుకు గల్లా సవరణలు
ఇదిలా ఉండగా, విభజన చట్టంలో కొత్తగా సెక్షన్ 46(4) చేర్చి ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల తరహాలో ఏపీకి పదేళ్ల పాటు హోదా ఇవ్వాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు తలసరి ఆదాయం ప్రాతిపదికన కేబీకే, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన 2018 ఆర్థిక బిల్లుకు గల్లా పలు సవరణలు ప్రతిపాదించారు. ఆర్థిక బిల్లులో కొత్తగా 21వ భాగం చేర్చి అందులో ఏపీ విభజన చట్టానికి సవరణలు చేయాలని కోరుతూ లోకసభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు ఇచ్చారు.