ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సీరియస్ : అన్నమయ్య ప్రాజెక్టు నష్టానికి బాధ్యులెవరు - తలవంపులు కాదా ..!!
ఏపీ ప్రభుత్వం పైన రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు..వరదల కారణంగా కడప జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీని కారణంగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. దీని పైన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సభలో ప్రస్తావించారు. ఈ నష్టానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఆనకట్టల భద్రతకు బిల్లును ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ప్రమాదం సూచిస్తోందన్నారు. రాజ్యసభలో ఆనకట్టల భద్రత బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
ఆ నష్టానికి బాధ్యత ఏపీ ప్రభుత్వానిది కాదా
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటంతో భారీ ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టులోకి ఒక్క సారిగా భారీగా నీరు వచ్చిందని... ప్రాజెక్టు సామర్ధ్యం కంటే ఒకటిన్నార రెట్లు నీరు అధికంగా వచ్చి చేరిందని వివరించారు. ఆ సమయంలో ప్రాజెక్టు స్పిల్ వేతో పాటు గేట్లు కూడా తెరిచి.. వచ్చిన వరదను వచ్చినట్లు బయటకు పంపాల్సిందని అభిప్రాయపడ్డారు. అందులోని అయిదు గేట్లలో ఒక గేటు తెరుచు కోలేదని చెప్పారు. ఎందుకంటే అది పనిచేయడం లేదన్నారు. చాలా బాధతో ఈ విషయం చెబుతున్నానని.. దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నానని అంటూ... రాష్ట్రప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా అని కేంద్ర మంత్రి నిలదీశారు.
తలవంపులు తెచ్చే అంశం అంటూ
దీని కారణంగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగిందన్నారు. భారత్లో ఇలా మరో ఆనకట్ట కూలిందని చర్చించుకుని.. దీనిని ఓ కేస్ స్టడీలా తీసుకోవడమంటే.. అది యావజ్జాతికే తలవంపులు తెచ్చే విషయం కాదా..అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో లార్జీ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఉన్నట్లుండి బియాస్ నది నీరు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయి మరణించిన ఘటనను మంత్రి గుర్తు చేసారు. రాష్ట్రాలు తమ పరిధుల్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదాలు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు.
హఠాత్తుగా వచ్చిన వరదతోనే
కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు అవగాహన లేకుండా చేసినట్లు ఉన్నవని చెప్పారు. ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని వివరించారు. ఇటువంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం అందరికీ తెల్సిందేనన్నారు. అందులో 150 మంది జల సమాధి అయ్యారని గుర్తు చేసారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ కావటంతోనే, నిజాల్ని దాచే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఆ ఇద్దరి ప్రభావంతోనే కేంద్ర మంత్రి
అన్నమయ్య ప్రాజెక్టులో ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి బయటకు వెళ్ళగల నీటి సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు అయితే, విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనేనని చెప్పారు. కాబట్టి, ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదు. ఈ అంశం స్పష్టంగా తెలిసినా, షెకావత్ ఈ విషయంలో నిజాలు విస్మరించారన్నారు. ఈ మొత్తం షెకావత్ వెనక కూర్చున్న సీఎం రమేష్, సుజనా చౌదరి బహుశా కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం తరఫున వినిపించి ఉంటారని భావించాలని అభిప్రాయపడ్డారు.
Recommended Video
మమ్మల్ని సంప్రదించలేదు.. సంమజసమేనా
ఏం జరిగిందనే విషయాన్ని జిల్లా కలెక్టర్ నుంచి గానీ, ప్రాజెక్టు అధికారులతో గానీ, కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా, ఇటువంటి ప్రకటనలు చేయడం, నిరాధారమైన, అత్యంత సున్నితమైన అంశాలను సాక్షాత్తూ పార్లమెంటులో మాట్లాడటం, ఎంతవరకు సమంజసమన్నది వారు కూడా ఆలోచించాలని మంత్రి అనిల్ సూచించారు. నిరాధారమైన ఈ వ్యాఖ్యలను పట్టుకుని తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ చూస్తే, జల ప్రళయంలో కూడా ఇంత దిగజారిన రాజకీయం చేయవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అనిల్ పేర్కొన్నారు.